విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిందని ఎవరూ అధైర్య పడొద్దని అండగా ఉంటామని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధికారం కోల్పోయామని కృంగిపోవద్దని, మీకు ఏ కష్టమొచ్చినా, ఏ ఆపద వచ్చినా మేము ఉన్నామంటూ వైసీపీ అండగా ఉంటుందన్నారు. ఎన్డీఏ కూటమి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కూటమి అబద్దపు హామీల గాలిలో సైతం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి 12,853 ఓట్ల మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చంద్రశేఖర రెడ్డి, రవి చంద్రారెడ్డి, పూజారి ఈరన్న, దొడ్డిమేకల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, ముక్కరన్న, అర్లప్ప, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.