విశాలాంధ్ర, పెద్దకడబూరు : బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని రాగిమాన్ దొడ్డి, గంగులపాడు గ్రామాల్లో పర్యటించి సర్పంచ్ చంద్రకళ, వైసీపీ నేత యంకప్ప స్వామితో సమావేశమై వాలంటీర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భద్రతలను సక్రమంగా నిర్వర్తించాలని, సర్పంచ్ కు జవాబుదారీతనంగా పనిచేయించాలని వాలంటీర్లను ఆదేశించారు. అలాగే దొడ్డిమేకల గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి ప్రజల అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పెద్దకడబూరు గ్రామ శివారులోని జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యత ఉండాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.