విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) ; ప్రధానమంత్రి భారతీయ జన ఔషది కేంద్రం ద్వారా ప్రజలకు తక్కువ ధరలకే మందులను అందించడం జరుగుతుందని సొసైటీ అధ్యక్షులు హనుమంతరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ప్రాథమిక సహకార సంఘం నందు కార్యదర్శి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు హనుమంతరెడ్డి చేతుల మీదుగా జన ఔషది కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, మద్య తరగతి కుటుంబాలు వారు అనారోగ్యానికి గురైతే మందులను కొనడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ మరియు మెడికల్ డివైసెస్ ఆఫ్ ఇండియా తరపున ప్రజలకు తక్కువ ధరలకే మందులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఔషదాల కోసం ఎక్కువ డబ్బులు వృధా చేసుకోకుండా దాదాపు 50 శాతం నుంచి 90 శాతం వరకు తక్కువ ధరల్లో అత్యంత నాణ్యమైన ఔషదాలను పొందవచ్చునని వారు పేర్కొన్నారు. జన ఔషది కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ వీఆర్వో రామలింగారెడ్డి, కెడిసిసి బ్యాంకు ఫీల్డ్ అధికారి విజయ భాస్కర్, వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, బ్రహ్మయ్య, దేవసహాయం, ఏసన్న, బ్యాంకు సహాయకులు నారాయణ,ఫార్మాసిస్టు తారా, కంప్యూటర్ ఆపరేటర్ రామ స్వామి, డైరెక్టర్ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు.