విశాలాంధ్ర- కర్నూల్ సిటీ: ప్రజా ప్రయోజనాల కోసం వేసిన రోడ్డులో ఆక్రమణ నిర్మాణాలు చేపట్టిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి సోదరుడు ఆదిమూలపు సురేష్ పై చర్యలు తీసుకోవాలని సిపిఐ సీనియర్ నేత కే. జగన్నాథం, నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి, నాయకులు డి.శ్రీనివాసరావు సి. మహేష్ లు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భార్గవ తేజను కోరారు. సోమవారం స్థానిక నగరపాలక సంస్థ సమావేశ భవనంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఏ క్యాంపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్లో మంత్రి సోదరుడి ఆదిమూలపు సతీష్ ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలని సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కమీషనర్ కు అర్జీ అందజేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ నుంచి మాంటిస్సోరి పాఠశాల వరకు రహదారి నిత్యం రద్దీగా ఉంటుందని, ఈ రహదారిలో 20 అడుగుల రోడ్డు ఆక్రమణకు గురి కావడం వల్ల ప్రజా రవాణాకు ఇబ్బందిగా మారిందని వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డును ఆక్రమించి పార్కును ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆయన తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్టించారని వారు కమిషనర్ కు వివరించారు. మంత్రి సోదరుడు జోహరాపురం రోడ్డులోను స్థలాన్ని ఆక్రమించి సుమారు 40 షాపులు నిర్మించుకొని ఒక్కో షాపుకు 5వేల నుంచి 6వేలవరకు బాడిగలు వసూలు చేసుకుంతున్నారని వారు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. నగర పాలక సంస్థకు రావలసిన ఆదాయానికి గండి కొట్టడంతో పాటు ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తున్న మంత్రి సోదరుడు ఆదిముల సురేష్ ఆక్రమణ నిర్మాణాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని వారు కమిషనర్ ను కోరారు.