: ఉత్తరాఖండ్ హైకోర్టు
ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనేనని ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్ రోడ్వేస్ కర్మచారి యూనియన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ కేసులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్కు ఈ విషయాన్ని గుర్తు చేసింది. ఉద్యోగులకు ప్రతి నెలా వారి న్యాయమైన జీతాల చెల్లింపును మానుకునేందుకు ట్రాన్స్పోర్టు కార్పొరేషన్కు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అనుమతి లేదని తెలిపింది. ఉద్యోగుల నెలవారీ జీతాలను చెల్లించకపోవడం ఆర్టికల్ 21, 23, 300-ఏలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు తమకు వేతనాలు చెల్లించడం లేదంటూ ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీచేసింది.