న్యూదిల్లీ : ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పేలవ పనితీరుపై ఆ పార్టీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ు (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన నాగ్పూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షకులనుద్దేశించి మాట్లాడుతూ…మణిపూర్లో హింస, సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది మేలో హింస చెలరేగిన తర్వాత మొదటిసారిగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గురించి భగవత్ మాట్లాడుతూ… ‘‘మణిపూర్ శాంతి కోసం ఒక సంవత్సరం కాలంగా ఎదురుచూస్తోంది. అక్కడ హింసను అరికట్టాలి. అందుకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని అన్నారు. ‘మనం ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యూహం, క్రీడలు, సంస్కృతి, సాంకేతికత వంటి అనేక రంగాలలో పురోగతి సాధించాం.. అంటే మనం అన్ని సవాళ్లను అధిగమించామని కాదు’ అంటూ పరోక్షంగా మోదీ సర్కారుకు చురకలం టించారు. వివిధ అంశాలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించాలని చెప్పారు. ‘ఎన్నికలు ఏకాభిప్రాయాన్ని పెంపొందించే ప్రక్రియ. పార్లమెంటులో ప్రతి సమస్యపై భిన్నాభిప్రాయాలుంటాయి. ఒక పక్షం ఒకవైపు మాట్లాడితే… ప్రతిపక్షం పార్టీ మరొక కోణాన్ని ప్రస్తావించాలి. తద్వారా మనం సరైన నిర్ణయానికి చేరుకుంటాము’ అని భగవత్ ప్రతిపక్షం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.