పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలు/పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. గతంలో ఇది 15 శాతంగా ఉండగా.. 10 శాతానికి తగ్గిస్తూ తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఈ మొబైల్ ఫోన్ పరికరాల్లో బ్యాక్ కవర్స్, బ్యాటరీ కవర్స్, Gూవీ యాంటెన్నా, మెయిన్ కెమెరా లెన్స్, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెకానికల్ ఐటెమ్స్పై దిగుమతి సుంకం 5 నుంచి 10 శాతం వరకు తగ్గించడం విశేషం. ఇంకా ఈ కాంపోనెంట్స్ తయారు చేసేందుకు ఉపయోగించే ఇన్పుట్స్పై దిగుమతి సుంకం సున్నాకు చేర్చింది.
ఈ మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గించడం.. భారతదేశంలో పెద్ద ఎత్తున మొబైల్ అసెంబ్లింగ్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ఇంకా.. మొబైల్ ఫోన్స్ ఎగుమతుల్ని పెంచేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ పరికరాలు దిగుమతికి ఎక్కువ ఖర్చు అవుతోంది. ఈ దిగుమతి సుంకం తగ్గించిన నేపథ్యంలో.. స్మార్ట్ఫోన్ ధరలు కూడా తగ్గుతాయని చెప్పొచ్చు. దిగ్గజ మొబైల్ తయారీ కంపెనీలు భారత్లో పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్స్ తయారు చేస్తుండటం వల్ల వీటి ఎగుమతులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్కు ముందు ఇప్పటికే ఈ దిగుమతి సుంకం తగ్గిస్తుందని అంచనాలు ఉన్నాయి. దేశంలో మేకిన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా.. తయారీ రంగాన్ని మరింత పెంచేందుకు దిగుమతి సుంకం తగ్గించొచ్చని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ టాక్స్ తగ్గింపులతో.. తయారీ రంగం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే యాపిల్ వంటి ప్రపంచ దిగ్గజ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ.. భారత్లో మొబైల్ ఫోన్స్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ఈ ఫోన్స్ తయారీకి మరింత ఊతం ఇచ్చినట్లుగా ఉంటుందని, సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నారు.