రష్యా సోషలిస్ట్ విప్లవం జరిగిన 1917 నవంబర్ 7న ఢాకాలో జన్మించిన సాధన్ గుప్తా మన పార్లమెంటులో మొట్టమొదటి అంధ సభ్యుడు. వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. స్వాతంత్య్రానికి పూర్వం ఆయనకు మేటి న్యాయవాది అన్న ఖ్యాతి ఉండేది. బ్రిటిష్ చక్రవర్తికి-శివనాథ్ బెనర్జీకి మధ్య జరిగిన వ్యాజ్యంలో ఆయన వాదనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే ఆయనకు మశూచి సోకి చూపు కోల్పోయారు. కోల్కతాలోని అంధుల పాఠశాలలో చదువుకున్నారు. మెట్రిక్యులేషన్ పరీక్షలో మొదటి పది స్థానాలలో నిలిచారు. ప్రెసిడెన్సీ కళాశాలలో మొదట ఎంఏ అర్థ శాస్త్రం పూర్తి చేసి అదే విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీలో ఉత్తీర్ణులయ్యారు. కళాశాల విద్య అభ్యసిస్తున్నప్పుడే వామపక్ష విద్యార్థి ఉద్యమం వేపు ఆకర్షితులయ్యారు. బెంగాల్ ప్రొవిన్షియల్ విద్యార్థి సమాఖ్యకు అధ్యక్షుడయ్యారు. 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. సీపీఐ చీలినప్పుడు ఆయన సీపీఎం లో చేరారు. మొదటి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1962 వరకు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. మూడు దఫాలు సాధన్ గుప్తా కోల్కతా ఆగ్నేయ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అంధుల జాతీయ సమాఖ్యకు తొలి అధ్యక్షులయ్యారు. ఆ తరవాత అంతర్జాతీయ అందుల సమాఖ్య భారత విభాగానికి అధ్యక్షులయ్యారు. బెంగాల్ అడ్వొకేట్ జనరల్గా కూడా పని చేశారు. ఆయన తండ్రి జోగేశ్ చంద్ర గుప్తా కూడా ప్రసిద్ధ బారిష్టర్.
సాధనగుప్తా మరణించినప్పుడు అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ నివాళులర్పిస్తూ ‘‘ఆయనలో గాంధేయ నిరాడంబరత, ప్రజాస్వామ్య దృక్కోణం, విలువలకు కట్టుబడి ఉండే లక్షణం’’ స్పష్టంగా కనిపించేది అన్నారు. సాధన్ గుప్తాకు 1992లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది.