న్యూదిల్లీ : స్వాతి మలివాల్పై దాడి అంశంపై దర్యాప్తునకు దిల్లీ పోలీసులు తాజాగా ‘సిట్’ని ఏర్పాటు చేశారు. దీనికి నార్త్ దిల్లీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజిత చెప్యాల నేతృత్వం వహిస్తారు. దీనితో పాటు సిట్లో ముగ్గురు ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులను చేర్చారు. వీరిలో కేసు నమోదైన సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లోని ఒక అధికారి కూడా ఉన్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం మలివాల్పై కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటన జరిగిన క్రమాన్ని తెలుసుకోవడానికి దిల్లీ పోలీసులు సోమవారం విభవ్ కుమార్ను సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్కు తీసుకెళ్లారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలను వరుసగా నోట్ చేసుకున్నామని, వాటిని మ్యాప్ చేసి గంటపాటు నేరం జరిగిన ప్రదేశాన్ని ఫొటోలు తీశామని పోలీసు అధికారులు తెలిపారు.
ఆప్తో నా కుటుంబానికి ముప్పు
ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని స్వాతి మలవాల్ ఆరోపించారు. దీనివల్ల తన కుటుంబానికి ప్రమాదముందన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నెంబర్లు మొదలైన వాటిని లీక్ చేయడాన్ని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా మాట్లాడుతూ ‘నేను అవినీతికి పాల్పడినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని దిల్లీ మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సూచనల మేరకే చేశానని పుకార్లు సృష్టిస్తున్నారు. 2016లో నా మీద నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయబద్ధంగా పోరాటం చేశాను. కోర్టు అది తప్పుడు కేసుగా నిర్ధారించి… కొట్టేసింది. ఆ సమయంలో ఆప్ నేతలు నన్ను లేడీ సింగం అని పొగిడారు. వారికి నేనిప్పుడు బీజేపీ ఏజెంట్గా కనిపిస్తున్నానా’ అని ఆప్ నేతలను ప్రశ్నించారు. దిల్లీ మంత్రులు అధికార మత్తులో ఉన్నారని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. వారు చెప్పే ప్రతి అబద్ధానికి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. నిజం మాట్లాడినందుకు పార్టీ మొత్తం తనపై ట్రోల్ చేస్తోందన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరినీ పిలిచి తన వ్యక్తిగత వీడియోలు ఉంటే పంపమని చెబుతూ, వాటిని లీక్ చేస్తున్నారని విమర్శించారు.