విజయవాడలోని విశాలాంధ్ర కార్యాలయంలో ‘మే’ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ విశాలాంధ్ర శాఖ కార్యదర్శి పి.మధుసూధన్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీఐ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మతం, కులంతో సంబంధం లేకుండా ఐక్యంగా ఉండేది కార్మికులే అని, వారు జరుపుకునే పండగే మేడే అని పేర్కొన్నారు. ఇప్పడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే కుల మతాల పేరిట పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని అన్నారు. విశాఖ ఉక్కు, రైల్వే, బీఎస్ఎన్ఎల్ వంటివన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతికి అందిస్తున్నారని, వాటిని పరిరక్షించుకోవాలంటే కార్మికులంతా కలిసి పోరాడాలని ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. అనంతరం
సీపీఐ విశాలాంధ్ర శాఖ సహాయ కార్యదర్శి వి.రమేష్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి మోదుమూడి మురళీకృష్ణ,అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, స్టేట్ బ్యూరో చీఫ్ చావా రవి, సి.ఏ.రాంబాబు, యోగిత, శాంతి, చందన, రమణమ్మ, రంగమ్మ, విశాలాంధ్ర సిబ్బంది, పూర్వసిబ్బంది, పూర్వ ఉద్యోగులు, తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.