నందిరాజు రాధాకృష్ణ
స్వాతంత్రోద్యమ కాలంలో కనిపించిన అరుదైన పత్రికా రచయితల్లో ఘనాపాఠి మద్దూరి అన్నపూర్ణయ్య. మహాత్మా గాంధీ పిలుపుతో స్వరాజ్య పోరాటంలో కాలుపెట్టారు. కలం పోట్లతో బ్రిటీష్ ప్రభుత్వంపై దండయాత్ర చేసిన పాత్రికేయుడాయన. ఆయన అనేక పత్రికల సారథి. జాతీయవాదాన్ని శ్లాఘించే రచనలతో పత్రికను వెలువరించేవారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ వీరాభిమాని. సామ్యవాదం(సోషలిజం) వైపు మొగ్గుచూపారు. సుభాష్ చంద్ర బోస్కు అభిమాన పాత్రుడయ్యారు. ఫార్వర్డ్బ్లాక్కు వీరాభిమాని. చివరిదశలో కమ్యూనిస్టులతో గళం కలిపారు. ఆయన మొదటి పత్రిక ‘‘కాంగ్రెస్’’. ఆయన పోరాట చరిత్ర మొత్తం ఆ పత్రికతోనే ముడిపడివుండేది. తరువాత ‘వెలుగు, ‘నవశక్తి’, ‘జయభారత్’ పత్రికలను ప్రారంభించారు. ‘నవశక్తి’ని కమ్యూనిస్టులు తమ రాజకీయ తరగతులలో పంచిపెట్టేవారు. విద్యార్ధి, వామపక్ష ఉద్యమాలకు ఆ పత్రిక మద్దతు పలికేది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర ‘కొమరగిరి’ అన్నపూర్ణయ్య స్వస్థలం. 1899 మార్చి 20న ఆయన జన్మించారు. కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్ చదువుతున్నపుడు స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షితుడయ్యారు.
1921 మే నెలలో రాజమండ్రి నుంచి ప్రారంభమైన ‘కాంగ్రెస్’ వారపత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు ఆయనే. ముద్రణా యంత్రంపై కాకుండా సైక్లోస్టయిల్ పద్ధతిన ప్రచురించారు. రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలోని సీతానగరంలో సుబ్రహ్మణ్యం 1924లో గౌతమీ సత్యాగ్రహాశ్రమం స్థాపించారు. అది దక్షిణ సబర్మతి ఆశ్రమంగా ఖ్యాతినొందింది. సుబ్రహ్మణ్యం ఆలోచన మేరకు 1925 సెప్టెంబర్ మాసంలో ‘కాంగ్రెస్’ పత్రిక ప్రచురణ అక్కడికి తరలింది. గ్రామీణ ప్రాంతం నుంచి వెలువడిన పత్రికగా ప్రసిద్ధి పొందింది. 1929 కాలానికి 1857 సమరంలో తొలి తూటా పేల్చిన మంగళ్ పాండే ఇందులో కథానాయకుడు. చివరికి, ఈ నాటిక హింసను ప్రేరేపించేదిగా రూపుదిద్దుకోవడంతో గాంధీ కలవరపడ్డారు. ప్రభుత్వం కక్ష కట్టింది. రాజమండ్రి మేజిస్ట్రేట్ 1929 జులైలో కేసు విచారించి పత్రిక ఎడిటర్ అన్నపూర్ణయ్యకు రెండున్నర సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. అన్నపూర్ణయ్య జైలుకు వెళ్లడంతో క్రొవ్విడి లింగరాజు సంపాదకుని బాధ్యతలు చేపట్టారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం మొదలై సామూహిక అరెస్టులు జరగడంతో పత్రిక తాత్కాలికంగా మూతపడిరది. 1931లో గాంధీ-ఇర్విన్ ఒప్పందం మేరకు ఆంక్షలన్నీ తొలగిపోయి ‘కాంగ్రెస్’ పునః ప్రారంభమైంది. ఆ వెనువెంటనే తొలిసంచికలోనే భగత్ సింగ్ బలిదానాన్ని శ్లాఘిస్తూ ‘వీరబలి’ పేరుతో సంపాదకీయం రాశారు మద్దూరి. రాజగురు, సుఖదేవ్లను స్మరించారు. దీనితో ప్రభుత్వ యంత్రాంగం ఆ పత్రికపై మళ్లీ కన్నువేసింది. సీతానగరం ఆశ్రమం చట్టవ్యతిరేకమని మద్రాసు పోర్ట్ సెయింట్ జార్జి గెజెట్ 1932 జనవరిలో ప్రకటన జారీ చేయడంతో ‘కాంగ్రెస్’ పత్రికకు భరతవాక్యం పలికింది. ముస్తాఫా ఆలీఖాన్ జనవరి 12న ఆశ్రమంపై దాడిచేసి ఏ వస్తువునీ వదిలిపెట్టలేదు. బాల, వృద్ధ విచక్షణ చూపలేదు. పరమ కిరాతంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ పత్రిక ముద్రణా యంత్రాలు, ఫైళ్లు సర్వనాశనం చేసారు. రాట్నాలు, మగ్గాలు, కుటీర పరిశ్రమల పరికరాలు ధ్వంసమయ్యాయి. తరువాత ‘కాంగ్రెస్’ వెలుగు చూడలేదు. అన్నపూర్ణయ్య గొప్ప ధీశాలి, ఉద్యమకారుడు, పత్రికా రచయిత, వక్త. ఆయన సహ ధర్మచారిణి శ్రీమతి వెంకట రమణమ్మ కూడా విదేశీ వస్త్ర బహిష్కరణలో పాల్గొని జైలుకు వెళ్లారు. అన్నపూర్ణయ్య జైలులో వుండగానే రమణమ్మ 1943లో కన్నుమూశారు. అన్నపూర్ణయ్య చివరి దశలో ఏలూరులో సెరిబ్రెల్ మలేరియాతో 1954 మార్చి 11న తుదిశ్వాస విడిచారు.
తెల్లదొరలు ఎవరినో చంపి అల్లూరి సీతారామరాజును చంపేసినట్లు ఫొటో ప్రకటించగా… వెంటనే స్పందించి తన కాంగెస్ పత్రికలో తెల్ల దొరలు చంపింది అల్లూరిని కాదు, వారు ప్రకటించిన ఫొటో సీతారామరాజుది కానే కాదు అని ప్రచురించి ఆశ్చర్య పరచిన ధీశాలి అన్నపూర్ణయ్య. అల్లూరి సీతారామరాజు గురించి యంగ్ ఇండియాలో గాంధీజీ రాయడానికి మూల కారకుడు అన్నపూర్ణయ్య అనీ, ఆయన గాంధీజీకి రాసిన లేఖ కారణమని చెప్తారు. ఆయన జైలులో ఉన్న కొన్ని సందర్భాలలో సుభాష్ చంద్రబోస్ మనియార్డర్లు పంపేవారట. ఆర్థికాంశాల్లో కారల్మార్క్స్ను అభిమానించిన అన్నపూర్ణయ్య ఆథ్యాత్మిక అంశాల్లో ‘‘మెహర్ బాబా’’ ను అనుసరించడం, మెహర్బాబా సందేశ వ్యాప్తి కోసం వెలుగు అనే పత్రికను కొంతకాలం నడపడం ఆయన స్వతంత్ర ఆలోచనా విధానానికి దర్పణం. కాంగెస్, నవశక్తి, జై భారత్ – పత్రికల్ని ఆదర్శవంతంగా నడిపిన పత్రికా సంపాదకుడు మద్దూరి అన్నపూర్ణయ్య. కొన్నాళ్ల తరువాత ‘గోడ పత్రిక’ నిర్వాహకులలో ఆయన అతి ముఖ్యుడు. మద్దూరి అన్నపూర్ణయ్య పేరిట ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ‘‘మద్దూరి అన్నపూర్ణయ్య ఉత్తమ జర్నలిస్ట్’’ అవార్డును ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది. రచనకు వున్న శక్తిని గుర్తించిన వ్యక్తి అన్నపూర్ణయ్య. బ్రిటీష్ హయాంలో ‘ప్రమాదకర రచనలు’ చేసి ‘రాజద్రోహం’ కింద కారాగారం అనుభవించిన శక్తిమంతుడైన రచయిత ఆయన. ఒకటి కాదు, రెండు కాదు, 14 సంవత్సరాలు ఆయన జైలులో మగ్గారు. భావప్రకటనా స్వేచ్ఛకోసం జరిపిన యుద్ధంలో అంత సుదీర్ఘకాలం శిక్ష అనుభవించడం గర్వకారణమే అయినా, అది వెలుగు చూడవలసిన స్థాయిలో చరిత్ర పుటలలో చోటుచేసుకొనకపోవడం అత్యంత విచారకరం.
సీనియర్ జర్నలిస్ట్.
సెల్: 98481 28215