డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి
అవి నేను బెంగుళూరులోని ‘నిమ్ హాన్స్’లో మానసిక వైద్య శాస్త్రంలో పి.జి. డిగ్రీ పాసై పాండిచ్చేరిలోని ‘జిమర్’ లో సైకియాట్రిస్ట్గా పనిచేసే రోజులు. ఆంధ్రభూమి వీక్లీ సెంటర్ స్ప్రెడ్లో ఒక వారం ‘‘దెయ్యాలున్నాయా’’ అనే శీర్షికతో, అవి ఉన్నట్లుగా ఎవరో ఒక వ్యాసం రాశారు. అది చదివి వెంటనే భూమి ఎడిటర్ కనకాంబరరాజుకి ఇలా దెయ్యాలున్నాయని అశాస్త్రీయమైన విషయాలను ప్రచురించి పాఠకుల మైండ్ను కలుషితం చేయొద్దని ఘాటుగా ఒక ఉత్తరం రాశాను. ఆశ్చర్యంగా వెంటనే ఆయనస్పందించి నాకు బదులు రాస్తూ.. దెయ్యాలు లేవని సైకియాట్రిస్ట్గా ఒక ఆర్టికల్ రాసి పంపించమన్నారు. అంతవరకు నాకు ఎలాంటి రచనానుభవం లేదు. చివరకు కాలేజి మేగజైన్లో కూడా ఎప్పుడూ రాయలేదు. సరేనని ఛాలెంజ్గా తీసుకొని దెయ్యాలున్నాయనేది ఒక భ్రమ, మూఢ నమ్మకమేనని సోదాహరణంగా రాసి పంపిస్తే, వెంటనే మళ్ళీ దానిని సెంటర్ స్ప్రెడ్లో ప్రచురించారు. అదే నా మొదటి రచన, సైన్స్ రచన కూడా. ఆ తర్వాత మరిన్ని అలాంటి సైంటిఫిక్ ఆర్టికల్స్ నా చేత రాజు రాయించారు. అలా మొదలైంది నా సైన్స్ రచనావ్యాసంగం. ఆ తర్వాత 1983లో నేను విజయవాడలో ప్రాక్టీసు మొదలు పెట్టిన కొత్తలో స్వాతి సంపాదకులు వేమూరి బలరామ్ అనుకోకుండా ఒకసారి క్లినిక్కు వచ్చారు. నాతో కొంచెం సేపు మాట్లాడిన తర్వాత డాక్టర్, మీలో ఒక రచయిత కనబడుతున్నారు. మానసికసమస్యల పైన ఇంతవరకు ఒక రెగ్యులర్కాలమ్ ఏ పత్రికలో రాలేదు. మా స్వాతి కోసం మీరు తప్పకరాయాలి. ఈ సబ్జెక్ట్పై ప్రజల్లో చాలా అపోహలు, మూఢ నమ్మకాలు ఉన్నాయి. కనీసం ఒక సంవత్సరం పాటు చేద్దాం అన్నారు. అలా అని ‘‘మానసికసమస్యలు- సమా ధానాలు’’ శీర్షిక మొదలుపెట్టి ఒక సంవత్సరం అన్నది అయిదేళ్లు ధారా వాహికంగా ప్రచురించారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్ తోటకూర రఘు, ‘మానస వీణ’, ‘‘దర్పణం’’ అనే పేరుతో 250 వారాల పాటు నా చేత శీర్షికలను నిర్వహింప జేశారు. ఈ మధ్యలో కందనాతి చెన్నారెడ్డిగారు ‘‘పల్లవి’’ అని ఒక వీక్లీ ప్రారంభించి, దానిలో ఆరంభ సంచిక నుంచే ‘‘మానసిక వ్యధలోంచి కథ’’ శీర్షికను నా చేత రాయించారు. ప్రతివారం ఒక కథానిక దానికి ఒక సైకలాజికల్ ఎనాలసిస్ రాసేవాడిని. తెలుగులో అదొక కొత్త ప్రయోగం ఆ రోజుల్లో! ఆ తర్వాత కొద్ది కాలానికి దాసరి నారాయణరావు ఉదయం వీక్లీ మొదలైంది. ‘ఉదయం’లో కూడా దాదాపు రెండు సంవత్సరాల పాటు ఒక వాస్తవ ఘటనను కథా రూపంలో చెబుతూ, దానికి సైకో ఎనాలసిస్ చేసేవాడిని. వీటి మధ్యలో కొన్ని దినపత్రికలలోనూ, మాస పత్రికలలోనూ అడపా దడపా రచనలు చేసేవాడిని. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రతి మూడు నెలలకు ఒక సారి ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూనో, ప్రసంగమో ఉండేది. ఆకాశవాణి కేంద్రంలో అలా మానసిక సమస్యలపై ఎన్నో కార్యక్రమాలు చేశాను. హైదరాబాదు దూరదర్శన్ వారు ప్రతీ శనివారం ‘‘బంధాలు – అనుబంధాలు’’ అనే రెగ్యులర్ ఫోన్ ఇన్ కార్యక్రమం చేస్తూ, నన్ను ప్రత్యేకంగా విజయవాడ నుండి వారం వారం ఆహ్వానించి 13 వారాల పాటు ఆ కార్యక్రమాన్ని నాతో చేయించారు. ఆ కార్యక్రమం ఆ రోజుల్లో చాలా ప్రాచుర్యం పొందింది.
ఇవన్నీ ఇలా జరగుతుండగానే, జెమిని టీవిలో ఓంకార్ రచించిన కొన్నిసీరియల్స్వచ్చేవి. ఈ సీరియల్స్లో అడపా దడపా ఏదైనా ఒక క్యారెక్టర్ కొంత వింతగా ప్రవర్తిస్తే, విజయవాడలో డా. ఇండ్ల రామసుబ్బారెడ్డిని వెళ్ళి కలువుఅని ఆయన ఆ పాత్రలతో చెప్పించేవారు. మానసికజబ్బులపై, సమాజంలోఉన్న అపోహలు, స్టిగ్మాను తొలగించేందుకు ఆ సీరియల్స్ బాగా దోహద పడ్డాయి. ఈ తర్వాత ఓంకార్ ‘‘కార్తీక దీపం’’ సీరియల్ వస్తున్నప్పుడు, దాంట్లో సైకియాట్రిస్ట్గా నన్నే నటించమని బలవంత పెట్టి అదే పనిగా మద్రాస్ పిలిపించి ఏవిఎం స్టూడియోలో రెండు రోజుల పాటు నా క్యారెక్టర్ను చిత్రీకరించారు. ఈ సీరియల్ తెలుగునాట చాలా ప్రజాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. అవన్నీ జరగు తుండగానే ‘‘ఫ్యామిలీ బ్లూస్’’ అనే సినిమాలోనూ, ఇంకొన్ని టి.వి. సీరియల్స్లోనూ సైకియాట్రిస్ట్గా నేను నటించాను.
సాధారణంగా వైద్యశాస్త్రంలోని పేర్లన్నీ ఆంగ్లంలోనే ఉంటాయి. కొన్ని పేర్లను తెలుగులో మార్చలేము. అవి అలా ఆంగ్లంలో పలికితేనే అందరికీ సులువుగా అర్థమవుతుంది. ఉదా : అబ్సెస్ కంపల్సివ్ డిసార్డర్, అంటే వచ్చిన ఆలోచనే పదే పదే వచ్చి బాధ పెట్టడం, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయడం. దీన్ని కొందరు చాదస్తమని సులువుగా అన్నా, అది ఆ జబ్బుకు సరిjైున తెలుగు అనువాదం కాదు. అలాగే స్కిజోఫ్రీనియా అనే జబ్బు. దీన్ని తెలుగులో ‘పిచ్చి’ లేదా ‘ఉన్మాదం’ అని చెప్పవచ్చు. కానీ, ‘పిచ్చి’ అనే పదాన్ని వాడటం వలన, ప్రజల్లో ఆ వ్యక్తులపై చులకన భావం ఏర్పడి, మానసిక వ్యాధులపై ఇంకా చిన్న చూపు వచ్చే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు ‘‘పిచ్చి’’ అనే పదాన్ని వాడటం మానేశాను. కొన్ని జబ్బులకు నేనే తెలుగు పదాలను వాడాను.. ఉదా : ‘డిప్రెషన్’ అనే వ్యాధికి ‘మనో వేదన’ లేదా ‘క్రుంగుబాటు’ అని, అలాగే ‘ఫోబియా’కు అర్థంపర్థంలేని భయాలని! ప్రజల్లో మానసిక జబ్బులపై అవగాహన పెరిగే కొద్దీ, చాలావరకు ఆంగ్ల పదాలే అలవాటయ్యాయి. ఇప్పుడు వచ్చే రచనల్లో అందుకే సులభంగా పాఠకులతో కమ్యూనికేట్ చేయగల్గుతున్నాను.
‘‘మానసవీణ’, మనోదర్పణం, యూత్ టుడే, మానసిక సమస్యలు – సమాధానాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, యూత్ సైకాలజీ, మనసుకూ జబ్బులొస్తాయి’’ లాంటి తొమ్మిది పుస్తకాలు రచించాను. వీటిలో కొన్ని ఇతర భాషల్లోకి అనువదించాను. వీటన్నిటిలోను ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మానసవీణ, మానసిక సమస్యలు – సమాధానాలు పుస్తకాలు సుమారుగా పదిసార్లు రీప్రింట్ అయి, పాఠకుల ఆదరణను ఎంతగానో చూరగొన్నాయి. ఇలా రాసుకుంటూ పోతే గత 40 సంవత్సరాలలో సైన్స్ రచయితగా, మెడికల్ రైటర్గా నా అనుభవాలెన్నో! వీక్లీలో రాసినా, పత్రికల్లో రాసినా, టివి సీరియల్స్లో నటించినా, రేడియోలో మాట్లాడినా ఇవన్నీ నేను ఒక సైకియాట్రిస్ట్గా ప్రజల్లో మానసిక జబ్బుల పై ఉన్న అపోహలను తొలగించి, వారిలో అవగాహన కల్పించేందుకు చేసినవే. డాక్టర్లు ఎందరో ఉంటారు. క్లినిక్లో ఒక ఏసి రూంలో కూర్చోని తమ వద్దకు వచ్చే పేషంట్లకు వైద్యం చేయడంతోనే వైద్యుల బాధ్యత తీరిపోతుందని నేను అనుకోను. పేషెంట్ల నాడినే కాకుండా, సమాజం నాడిని కూడా పట్టుకొని, సామాజిక రుగ్మతల్ని కూడా వీలైనంతవరకు తొలగించేందుకు ప్రతి వైద్యుడు తన వంతు కృషి చేయాలనేదే నా ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకమే నన్ను ఒక సైన్స్ రైటర్గా, ఒక మెడికల్ రైటర్గా చేసింది. నా ఈ 40 సంవత్సరాల మానసిక వైద్య అనుభవంలో రకరకాల జీవిత సమస్యలతో వచ్చిన నా పేషంట్లు, నా రచనలకు మూలం. సినిమా కంటే ఆశ్చర్యం కలిగించే ఎన్నో జీవిత గాథలు వారు నా దగ్గర చెబుతుంటే, ఎంతో ఉద్వేగానికి లోనయ్యేవాడిని. వారే నా రచనకు ప్రేరణ. నాలో నిద్రాణమై ఉన్న ఒక రచయితను తట్టిలేపి నాతో ఇన్ని రచనలు చేయించి, తొమ్మిది పుస్తకాలు కూడా రాసేట్లు చేసిన నా రోగులు అందరికీ ఈ సందర్భంగా నా మనఃపూర్వక వందనాలు తెలుపుతున్నాను.