రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మిత్రులు శత్రువులుగా మారడం, శత్రువులు మిత్రులుగా మారడం రాజకీయ రణరంగంలో నిత్య కృత్యం. రాజకీయ నాయకులు చేసుకునే విమర్శల ఆధారంగా వారి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని అనుకోవడం అమాయకత్వమే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి మీద ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా బోలెడు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలన్నీ అన్యాపదేశంగానే సాగుతున్నాయి. సకల కీలకాంశాల మీద మౌనంగా ఉండే ప్రధానమంత్రి మోదీ గడ్కరి విమర్శల మీద ఇంతవరకు నోరు విప్పలేదు. నోరు విప్పడం తనకే ప్రమాదకరం అని మోదీకి తెలుసు. గడ్కరీ స్థాయి నాయకులకు ప్రధానమంత్రి కావాలన్న ఆశ ఉండడంలో తప్పూ లేదు. ఆశ్చర్యకరం అంతకన్నా లేదు. గడ్కరీకి ఆ కోరిక అంతరాంతరాల్లో ఉంది. తన ఆకాంక్ష తీరనందుకు నిరాశ, నిరుత్సాహం, చికాకు కూడా ఇటీవలి కాలంలో ఆయన మాటల్లో కనిపిస్తూనే ఉంది. అయితే గడ్కరీ సంధించే వాగ్బాణాలన్నీ తన మనసులో దాగి ఉన్న ఆకాంక్ష వ్యక్తం చేయడానికే తప్ప మోదీతో విధానపరమైన విభేదాలు కావవి. మోదీ ముందు మిగతా మంత్రుల్లా మోకరిల్లడానికి గడ్కరి సిద్ధంగా లేరు. మోదీ కనిపించగానే ఒంగి ఒంగి దండాలు పెట్టడం ఆయనతత్వం కాదు. దీనికీ ఒక కారణం ఉంది. మోదీ ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడిగా ఉండి మొదట గుజరాత్ ముఖ్యమంత్రి అయి ఆ పదవిలో పుష్కరం కన్నా ఎక్కువ కాలమే ఉన్నారు. హఠాత్తుగా 2014 ఎన్నికలకు ముందు మోదీ పేరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొచ్చింది. అప్పుడు నితీశ్ కుమార్ కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకించిన వారే. ఆ తరవాత కనీసం రెండు సార్లు నితీశ్ కుమార్ బీజేపీని ఆలింగనం చేసుకున్నారు. నితీశ్ మోదీని విమర్శించిన సందర్భాలలో సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. నితీశ్లో ఇప్పటికీ సోషలిస్టు భావజాలం ఏ మూలో మిగిలే ఉంది. కానీ నితిన్ గడ్కరీ పరిస్థితి అది కాదు. ఆయన సంఫ్ు పరివార్ కుదురు నుంచి వచ్చిన వారే. అంతేకాదు ఆయనకు నాగపూర్లో ఆసీనులైన ఆర్.ఎస్.ఎస్. పీఠాధిపతుల ఆశీస్సులు దండిగా ఉన్నాయి. మోదీనే ఈ సారికూడా ప్రధానమంత్రి అభ్యర్థి అయితే బీజేపీకి గడ్డుకాలమే అని భావించే వారూ ఉన్నారు. కానీ మోదీ ఆర్.ఎస్.ఎస్.ను లెక్క చేసే స్థితిలో లేరు. ఆర్.ఎస్.ఎస్. సూచనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదు. ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ అవకాశం వచ్చినప్పుడల్లా మోదీని ఆకాశానికి ఎత్తి తరించి పోతున్నారు. నితిన్ గడ్కరి అలా కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా మోదీని అన్యాపదేశంగానైనా ఎత్తి పొడుస్తున్నారు. తద్వారా మోదీ కాకపోతే తాను ఉన్నానని ఆర్.ఎస్.ఎస్. అధినేతలకు సూచన ప్రాయంగానైనా చెప్తూనే ఉన్నారు. మోదీ మీద గడ్కరీ విమర్శలు రాజకీయంగా తన ఆకాంక్షల వ్యక్తీకరణకు, ఎదుగుదలకు సంబంధించినవే తప్ప సైద్ధాంతిక విభేదాల జాడ లేశ మాత్రం కూడా లేదు. ఉదాహరణకు ఎన్నికల బాండ్ల విషయమే నిదర్శనం. ఎన్నికల బాండ్లు మోదీ మెదడులో పుట్టిన ఆలోచనే కావచ్చు. తద్వారా ఆయన బీజేపీ ఖజానా నింపి ఉండొచ్చు. ఎన్నికల బాండ్ల గురించి తన అభిప్రాయాలను గడ్కరీ ఇటీవల ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అత్యంత స్పష్టంగానే చెప్పారు.
‘‘ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు కావాలిగా’’ అని నిర్మొహమాటంగానే చెప్పారు. ఈ బాండ్లను రద్దు చేస్తే నల్లధనం వీరవిహారం చేస్తుందన్నది ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అక్కడికి ఎన్నికల బాండ్లు కొన్న వారు నల్లధనం పెట్టి కొనలేదని చెప్పే స్థితి లేదుగా! ఎన్నికల బాండ్లవల్ల ఆర్థిక వ్యవస్థ ఎగబాకుతుందనీ అన్నారు. ఇది కచ్చితంగా మోదీ ఆర్థిక విధానాలను సమర్థించడమే. ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీలకు డబ్బు కావాలిగా అంటున్నారు గడ్కరి. కానీ ఈ బాండ్ల వల్ల అత్యధిక ప్రయోజనం బీజేపీకే కలి గిందని ఆయనకు తెలియనంత అమాయకుడు ఏమీ కాదు. అయితే బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడం మీద వ్యాఖ్యానించకుండా గడ్కరి జాగ్రత్త పడ్డారు.
గడ్కరీకి మోదీకి మధ్య పొరపొచ్చాలు ఈ నాటివి కావు. ఆ విభేదాలు పుష్కర కాలం పై నుంచే సాగుతున్నాయి. మోదీ ప్రధానమంత్రి కాక ముందునుంచే ఉన్నాయి. 2011లోనే మోదీ వచ్చి ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేయవలసిన అవసరం ఏమీ లేదు అని గడ్కరి స్పష్టంగానే మనసులో మాట బయట పెట్టారు. అప్పటికి మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించనైనా లేదు. ఆ సమయంలో గడ్కరి బీజేపీ అధ్యక్షుడిగా ఉండేవారు. మోదీ ఎన్నికల ప్రచార సభల వల్ల బీజేపీకి ఒరిగిందేమీ లేదని కూడా అంతకు ముందే వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పటికి బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్ జోషీని ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు సమన్వయకర్తగా నియమించాలని గడ్కరి అనుకున్నారు. అది మోదీకి నచ్చలేదు. ఆ సమయంలో మోదీ, గడ్కరి నెలల తరబడి ఫోన్లో కూడా మాట్లాడలేదంటారు. సంజయ్ జోషీ అంటే మోదీకి ముందు నుంచే ఇష్టం లేదు. కేశూభాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జోషీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉండే వారు. ఆయన మోదీని దిల్లీకి పంపించారు. గుజరాత్ లో అడుగు పెట్టొద్దని కూడా ఆదేశించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తరవాత జోషి దిల్లీకి మకాం మార్చాల్సి వచ్చింది. జోషీకి మళ్లీ పార్టీ బాధ్యతలు అప్పగించిన తరవాత జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోదీ హాజరయ్యే వారు కాదు. ఇలాంటి సందర్భాలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం మోదీ చాలా బలమైన నాయకుడిగా ఉన్నారు. సంఫ్ు పరివార్ కూడా ఆయనను నియంత్రించే స్థితిలో లేదు. అందుకే గడ్కరి విమర్శలను మోదీ పట్టించుకోవడం లేదు.
త్వరలో జరిగే ఎన్నికలలో బీజేపీకి భారీ విజయం కాకుండా అత్తెసరు మార్కులతో గట్టెక్కితే గడ్కరీకి మళ్లీ గొంతెత్తే అవకాశం ఉంటుందేమో! లేకపోతే గడ్కరీ విమర్శనాస్త్రాలు తాటాకు చప్పుళ్ల కిందే మిగిలిపోతాయి.
- అనన్య వర్మ