డాక్టర్ దేవరాజు మహారాజు
ఖుద్ గలత్ హోకర్ ఖుద్ కొ సహీ
సాబిత్కర్నా ఇతనా ముష్కిల్ నహీ హోతా
జిత్నా సహీ హోకర్, ఖుద్కొ సహీ సాబిత్ కర్నా
తప్పు చేసి, చేసిన పని సరైనదేనని నిరూపించుకోవడం ఏమంత కష్టమైన పనికాదు. సరైన పనిచేసి, చేసింది సరైనదే అని నిరూపించుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టం! అని పై చరణాలకు అర్థం. ‘ఇదీ భారత్! ఇండియా కాదు’ అని అంటాడొకడు. తాజ్మహల్ను తేజో మహల్ అని అంటానంటాడొకడు. అసలు యహుదీఅనే పదమే తప్పు
దాన్ని యాదవ అని అనాలని అంటాడుఇంకొకడు. ఇక భార్యను హత్యచేసి తత్త్వవేత్తగా మారిన వాడొకడు ఆస్ట్రేలియాను అస్త్రాలయా అని పిలవాలంటాడు. ఇంతమంది మేతావులు ఈ దేశంలో ఎందుకు పుట్టుకొచ్చా రంటే
ఆరో తరగతిలో స్కూల్లో పేరు తీసేస్తే పోయి, లేని రైల్వేస్టేషన్లో చాయ్ అమ్ముకున్నానన్నవాడు ఎంఏ డిగ్రీ కొనుక్కుని వచ్చి పరిపాలకుడైనందుకు! ఓ చోట తల్లిని, మరోచోట భార్యను విడివిడిగా వదిలేసి, నైతికత అనేది లేకుండా జాగ్రత్తపడిశూద్రుడై ఉండి మనువాద పల్లకీ మోస్తున్నందుకు!! ప్రపంచ దేశాలు బలాదూరు తిరుగుతూ ‘విశ్వగురువు’ నయ్యాననే భ్రమలో బ్రతుకుతున్నందుకు!! దేశం ప్రమాదకర స్థితిలోకి దిగజారిపోయింది. మెదడు గుడ్డిదైనప్పుడు కళ్లుండి లాభంలేదని అంటున్నది ఇందుకే.. దేశం ఈ స్థితికి రావడానికి మూలకారణం అర్ఎస్ఎస్ సంస్థ. అది ఎలాంటిదో అది ఎన్నెన్ని ఘనకార్యాలు వెలగబెట్టిందో చూడండి. 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపన జరిగింది. 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు, అందులో ఆర్ఎస్ఎస్ పాల్గొనదని తేల్చి చెప్పాడు హెడ్గేవార్! పైగా 1940 డిసెంబరులో బ్రిటీష్్వారి ‘ఇంపీరియల్ సివిల్ గార్డ్’లో చేరిన ఆర్ఎస్ఎస్ వారికి భజనచేసింది. 1942 ఆగస్టులో క్విట్ఇండియా ఉద్యమం ఊపందుకున్నప్పుడు తాము అందులో పాల్గొనబోమని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. 1947 ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం లభించినప్పుడు, మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని తాము జాతీయజెండాగా గౌరవించమని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. చాలాకాలం వారు దాన్ని ఎగురేయలేదు. అదీ వారి దేశభక్తి! 1948 జనవరిలో గాంధీని చంపినవాడెవరూ? ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాడ్సేనే కదా? ఇది బహిరంగ రహస్యమే కదా? 1948 ఫిబ్రవరిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న సంస్థగా గుర్తింపుపొంది ఆర్ఎస్ఎస్ భారత ప్రభుత్వ నిషేధానికి గురైంది. 1949 నవంబరులో మనుస్మృతిని తప్పించి, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోమని ఆర్ఎస్ఎస్ బహిరంగంగా ప్రకటించింది. 1951 ఫిబ్రవరిలో మహిళలకు సమానహక్కులు ప్రసాదించే ‘హిందూ కోడ్బిల్’ను అర్ఎస్ఎస్ వ్యతిరేకించి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తే ఏమనిపిస్తుంది? మెదడు గుడ్డిదైనప్పుడు కళ్లుండి లాభంలేదని అనిపించడంలేదా? ఇస్రో చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీయగలుగుతుంది. కానీ, 140 కోట్లకు పెరిగిన భారతదేశ జనాభాలోఉన్న మూర్ఖుల మెదళ్లలోంచి మూర్ఖత్వాన్ని ఇంకా మనం ఫొటో తీయలేకపోతున్నాం. చంద్రయాన్
3 విజయవంతమైంది గనక, అక్కణ్ణించి దేవుణ్ణడిగి మాకు వర్షాలెప్పుడు కురుస్తాయో అడిగి చెప్పాలనిబీహారుకు చెందిన ఒక వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ కింద దరఖాస్తు చేసుకున్నాడు. సామాన్యుల్లో ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మూర్ఖత్వం ప్రముఖుల్లో ఉంటే దాన్ని ఏమనాలి? ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఒక డీజీపీ రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశాడు. హిందూ పంచాంగాన్ని అనుసరించి విధులు నిర్వహించాలన్న ఆదేశాలతోపాటు రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు పంచాంగాలు పంపిణీ చేశాడు. పోలీసులు పంచాంగాలు చూసుకుంటారు సరే, మరి దొంగలు, నేరగాళ్లు పంచాంగాల ప్రకారం, నేరాలు చేయరుకదా? మెదడు గుడ్డిదైనప్పుడు కళ్లుండి లాభంలేదు కదా? చంద్రయాన్
3 విజయవంతంకాగానే చంద్రుణ్ణి ‘హిందూదేశ్’గా ప్రకటించాలని చక్రపాణి అనే స్వామి ప్రకటించాడు. లోగడ చంద్రయాన్2 కూలి పోయిన చోటుకు ‘తిరంగా పాయింట్’ అనీ
చంద్రయాన్3 ల్యాండర్ విజయవంతంగా దిగిన చోటుకి ‘శివశక్తి’ అని మోదీ ప్రభుత్వం పేర్లు పెట్టింది. తొలిసారి చంద్రుడి మీదికి మతాన్ని చేర్చగలిగామని చంకలు గుద్దుకుంది. అలా ఇష్టంవచ్చిన పేర్లు పెట్టడానికి వీలుండదు. దానికి అంతర్జాతీయ ప్లానిటరీ బాడీ విధించిన నియమాలు నిబంధనలూ కొన్ని ఉంటాయి. మూర్ఖత్వం వదులుకున్న వారికి మాత్రమే కదా విషయాలు అర్థమయ్యేదీ? చంద్రయాన్
3లో వెళ్లిన యాత్రికులకు సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించాడొక బీజేపీ మంత్రి. ఆస్ట్రనాట్స్ ఎవరూ వెళ్లలేదన్న విషయం కూడా ఆ మహాపురుషుడికి తెలియదన్నమాట! కాంగ్రెస్ పాలనలో చైనా మన దేశపు 43,000 కి.మీ భూమిని ఆక్రమించింది అని అన్నాడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. భూమి చుట్టు కొలతే 40,075 కి.మీ అయితే, అంత కన్నా ఎక్కువ భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించిందీ? మన దేశపు మొత్తం భూభాగం ఉన్నదే 32,87,263 చ.కిమీలు. నడ్డా 43వేల చదరపు కిలోమీటర్లు అని అనాల్సింది. అంత తెలివే ఉంటే బీజేపీకి అధ్యక్షుడెట్లా అవుతాడూ? అని దేశ ప్రజలు నవ్వుకున్నారు. చుట్టుకొలత కిలోమీటర్లలో చెపుతాం. విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో చెపుతాం. బీజేపీ మేధావులు మెదళ్లు మూసుకుని, తమ కళ్లుతెరిచే ఉన్నాయని అనుకుంటారు. మహిళలు బట్టల్లేకపోయినా అందంగానే ఉంటారంటూ పతంజలి బాబా రామ్దేవ్ వ్యాఖ్యానించాడు. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ భార్యపైన కూడా వ్యాఖ్యలు చేశాడు. అమెకు వందేళ్లవరకు ముసలితనం రాదని సర్టిఫికేట్ ఇచ్చాడు. మెదళ్లు మూసుకున్న పరిపాలకులకు ఆశ్రితులు మెదడులేని మూర్ఖులే ఉంటారు. పైగా మెల్లకళ్లతో చూసినా వాళ్లేమీ చూడలేరు. ‘‘ఒక దేశానికి, ఇంకో దేశానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తటస్థంగా ఉండడమోఏదో ఒక దేశానికే మద్దతివ్వడమో చేయవచ్చు కానీ, ఒక దేశానికి, ఒక ఉగ్రవాద సంస్థకి యుద్ధం జరుగుతున్నప్పుడు బుద్ధి ఉన్నోడెవడైనా ఉగ్రవాద సంస్థకి మద్దతిస్తాడా? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీపార్టీని ఆరు దశాబ్దాలు భరించడం మా తప్పయిపోయింది. ఇక మీదట ఆ అదృష్టం మా కొద్దులే నాయనా’’! అని ఒక తెలుగు సినీ గేయ రచయిత పరోక్షంగా కాంగ్రెస్ను విమర్శిస్తూ ఒక ప్రకటన చేశాడు. అతను జై శ్రీరామ్ అనలేదుగానీ, తానే ఆ శ్రీరామ్ అయినంతగా తన బత్తాయిరంగు ప్రదర్శించాడు. అయితే కాంగ్రెస్ పాలస్తీనా ప్రజలకు మద్దతిచ్చిన విషయం తెలుసుకోకుండా విమర్శించడం సరికాదని ఆనేక మంది బుద్ధి చెప్పారు. బుద్ధి ఉన్నోడెవడో లేనోడు ఎవడో అక్కడే అర్థమైంది. మిడిమిడి జ్ఞానంతో, వాట్సప్ యూనివర్సిటీ పట్టభద్రులు ఈ మధ్య ఇలాగే రెచ్చిపోతున్నారు. సినిమా పాటలురాసినా, మరోవైపు సాహిత్య రంగంలో కూడా విశిష్టమైన కృషి చేసిన మహనీయులకే దొరకాల్సిన గౌరవం దొరుకుతుంది. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను అంటూ తమ అల్పత్వాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటారు. చంద్రయాన్
3ని కూడా కొందరు మోసగాళ్లు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ‘రైస్పుల్లింగ్’ కారణమనీ అందుకు ఉపయోగించిన పాత్ర తమ వద్ద ఉందంటూ కొందరు హైదరాబాద్ రియల్ఎస్టేట్ వ్యాపారి నుంచి ఇరవై కోట్లరూపాయలు కొట్టేశారు. అతను లబోదిబోమని మొత్తుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తుచేసిన, నలుగురు నిందితుల్ని పట్టుకున్నారు. అణ్వాయుధాల్లోను, శాటిలైట్స్లోను ఉపయోగించే రాగి చెంబు తమ మద్ద ఉందంటూ వారు జనాన్ని మోసం చేస్తున్నారని పోలీసులు కుంభకోణాన్ని బైటపెట్టారు. మోసగాళ్లు చెప్పారు సరే మరి అంత ధనవంతుడైన ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మెదడెందుకు పనిచేయలేదూ? కనీసమైన ఇంగితజ్ఞానం, లోకజ్ఞానం లేకుండా కూడా కోట్లు సంపాదించొచ్చా? మెదడు గుడ్డిదైతే అంతేనేమో! భార్య, భర్తకు కాళ్లు ఎందుకు నొక్కాలి? అనే విషయం మీద ఒక పైత్యేషు శర్మ ఇలా వివరణ ఇచ్చాడు. సంప్రదాయబద్దమైన ఆ వివరణ విని, దైవ భక్తులంతా ముచ్చటపడ్డారు. ‘‘పురుషులకు కాలివేళ్లనుండి మోకాళ్లవరకు ఉన్న భాగం శనిది. స్త్రీల చేతివేళ్ల కొసల నుంచి ఆరచేయి వరకు ఉన్న భాగం శుక్రుడిది. భార్య, భర్త కాళ్లు పట్టడం ద్వారా శనిపై శుక్రుడి ప్రభావం పడి ఆ ఇంట ధనప్రాప్తి కలుగుతుంది!’’ చాలా పకడ్బందీగా సమాధానం కూర్చుకున్నారుగానీ, శనినీ, శుక్రుణ్ణీ నమ్మేదెవరూ? మెదడు గుడ్డిదైనవాళ్లు తప్ప? అందుకే ఎవరో సరిగానే చెప్పారు. ‘‘పురుషులు పురుషుల కోసం ఏర్పరుచుకున్నవే ఈ మతాలన్నీ’’ అని! ఈ మధ్య మహిళా ప్రవచనకారిణులు కూడా పెరిగిపోయారు. అలాంటావిడ ఇలా చెప్పింది. భర్తభార్యను ‘ఒసేయ్!’ అని పిలవడంలో ఎంతో గౌరవ ముందట. ఒసేయ్
అంటే ఇంటి యజమానురాలా అని అర్థమట. అలాగైతే ఈ వీధిలో పొయ్యేవాళ్లంతా ఈ విషయం చెప్పినావిడని ఒసేయ్! అని పిలుచుకుంటూ పోతేసరి! ఆమెకు బోలెడంత గౌరవం దక్కుతుంది కదా? మెదళ్లు గుడ్డివైపోయిన మత విశ్వాసకులు మనస్తత్వాన్ని ఎత్తిచూపే సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అయితే, న్యూయార్క్లో జరిగిన ఒక సంఘటన ఇలా ఉంది. 1820లో ఉత్తర న్యూయార్క్లోని ఒక సరస్సు పక్కన ఒక మత బోధకురాలు ఉండేది. ఆమెకు అసంఖ్యాకంగా అనుచరగణం ఉండేది. ఆమె మీద వారికి ఎంతో విశ్వాసం. ఒకసారి ఆమె నీటిమీద నడుస్తానని ప్రకటించింది. నడవబోయే రోజూ, సమయం కూడా ప్రకటించింది. అంతే! ఆ రోజుకు, ఆ సమయానికి లెక్కలేనంతమంది ఆ సరస్సు చుట్టూ చేరారు. ప్రకటించిన సమయానికి ఆ మత ప్రచారకురాలు అక్కడికి వచ్చింది. అనుచరుల్ని సంతృప్తిగా చూసుకుంది. నవ్వుతూ నాలుగువైపులా చెయ్యి ఊపింది. అనుచరగణం ఉత్సాహంగా కేకలేసింది. మత ప్రచారకురాలు అక్కడి జనాన్ని ఉద్దేశించి బిగ్గరగా ఇలా అడిగింది. ‘‘నేను ఈ సరస్సులోని నీటి మీద నడుస్తానని మీరు నమ్ముతున్నారా’’ అని అంది. అనుచరులంతా ఏకకంఠంతో ‘అవునూ అవునూ’ అని అరిచారు. ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. ‘‘అయితే సరేమీకు ఆ నమ్మకం ఉండడమే ముఖ్యం! మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇక నేను నడవకపోయినా ఫరవాలేదు.’’ అని మత ప్రచారకురాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. అనుచరులు కూడా నిరుత్సాహంగా వెళ్లిపోయారు. ఈ సంఘటనవల్ల మనకేం తెలుస్తోంది? విశ్వాసాన్ని బలపరుచుకోవడానికే మత ప్రచారకులు ప్రాధాన్యమిస్తారు. తప్పించి, చెప్పింది చేసి చూపలేరు. ఒక నిజ నిర్ధారణకు, నిలదీయనివారే మత విశ్వాసకులవుతారు! పైగా తమకు తాము భక్తులమని మురిసిపోతుంటారు. మెదడు గుడ్డిదైనప్పుడు ఇక అంతే!!
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త