ఏరోన్ బుష్నెల్కు గాజా యుద్ధంతో ఎలాంటి సంబం ధమూ లేదు. ఆ ప్రాంతవాసి కూడా కాదు. పాతికేళ్ల బుష్నెల్ అమెరికా వైమానిక దళంలో పని చేసే వాడు. వాషింగ్టన్లోని ఇజ్రాయిల్ రాయబార కార్యాల యం ముందు ఫిబ్రవరి 25న ఆత్మాహుతి చేసుకున్నాడు. యుద్ధం జరిగే ప్రాంతంతో, ఆ దేశాలతో ఏ సంబంధమూ లేని యువ సైనికుడికి ఎంతో సహానుభూతి ఉంటే తప్ప ఇలా ఆత్మాహుతి చేసుకునే అవకాశమే లేదు. గాజా ప్రజల మీద ఇజ్రాయిల్ అమానుష మారణకాండ బుష్నెల్ను విపరీతంగా కలచి వేసింది. తుది శ్వాస విడిచే ముందు ఆయన అన్న మాట ‘‘పలస్తీనాకు విమోచన’’. ఈ మాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆకాంక్ష. ఇలాంటి వారందరూ ఇజ్రాయిల్ మారణ కాండను తమకు తోచిన రీతిలో ఖండిస్తూనే ఉన్నారు. కానీ బుష్నెల్ మాత్రం ఆత్మా హుతి చేసుకుని తన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ తరం వారు తమ చుట్టూ ఏం జరుగుతోందో పట్టించుకునే రకం కాదు అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. కానీ బుష్నెల్ దానికి పూర్తిగా అపవాదు. అలా వాస్తవ పరిస్థితికి స్పందిస్తున్న వారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. తమ కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. 2020లో జార్జ్ ఫ్లాయిద్ను కొట్టి చంపినప్పుడూ ఇలాంటి స్పందనే కనిపించింది. గత నెల 14న పోలీసు కాల్పుల్లో మరణించిన 21 ఏళ్ల శుభకరణ్ సింగ్ కూడా ఇలాంటి కోవకే చెందిన రైతు. మళ్లీ మొదలైన రైతుల ఉద్యమ ప్రభావం కారణంగా జరిగిన కాల్పుల్లో శుభకరణ్ ప్రాణాలు పోయాయి. బుష్నెల్ లాంటి వారి ఆత్మాహుతులు నిరస నోద్యమాల చరిత్రలో చాలానే కనిపిస్తాయి. దక్షిణ వియత్నాం ప్రభుత్వం బౌద్ధులను వేధిస్తున్నందుకు నిరసనగా వియత్నాంకు చెందిన బౌద్ధ సన్యాసి తిచ్ క్వాంగ్ డక్ ఇలాగే 1963లో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సైగాన్ లో జరిగింది. దక్షిణ వియత్నాంను ఆక్రమించుకున్న అమెరికా దళాలు అఘాయిత్యాలకు పాల్పడేవి. ఆయన ఆత్మాహుతి జ్ఞాపకాలు ప్రపంచ ప్రజల జ్ఞాపకాల్లో ఇంకా పదిలంగానే ఉన్నాయి. దక్షిణ వియత్నాం ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమం వల్లే అమెరికాదన్ను ఉన్న దక్షిణ వియత్నాం ప్రభుత్వం అప్పుడు పతనమైంది. మున్సిపల్ అధికారులు తన సామాగ్రిని స్వాధీనం చేసుకుని వేధించినందుకు నిరసనగా 2010లో 26 ఏళ్ల వీధి వ్యాపారి తరేక్ ఎల్-తయెబ్ మహమ్మద్ బౌవజిజి ఇలాగే టునీషియాలో ఒంటికి నిప్పంటించుకుని ప్రాణ త్యాగం చేశాడు. ఆయన మరణం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమానికి దోహదం చేసింది. అదే పశ్చిమాసియాలో అరబ్ ఉద్యమానికి నాందీ అయింది. ఆ ఉద్యమం వల్ల ఆ ప్రాంతంలో అనేక ప్రభుత్వాలు పతనం కాక తప్పలేదు. పలస్తీనా ప్రజల పోరాటానికి మద్దతుగా 2023 డిసెంబర్లో ఒక నిరసనకారుడు అట్లాంటాలో ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఊహాతీతమైన నిరాశకు, నిస్సహాయతకు నిదర్శనం. విధి లేక తీవ్ర వ్యధతో ఆత్మాహుతికి పాల్పడు తుంటారు. వీటి ప్రభావం ప్రపంచంలో కనిపిస్తూనే ఉంటుంది. మనం ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాం అనుకోవడం పెద్ద విషాదం. ఒక వేపు జరుగుతున్న దాష్టీకాలను చూస్తూ భరించలేక నిస్సహాయులైనందువల్ల ప్రాణ త్యాగం చేసుకుని మన సామూహిక చేతనను తట్టి లేపుతారు.మారణకాండ జరుగుతున్న గాజాకు వేల మైళ్ల దూరంలో ఉన్న బుష్నెల్ పలస్తీనా వారి మీద జరుగుతున్న కిరాతకాలను భరించలేక పోయారు. చివరకు ఆత్మహత్య చేసుకుని బలమైన నిరసన వ్యక్తం చేశారు. అంటే ఆయనకు తీవ్రమైన సహానుభూతి చూపే సామర్థ్యం ఉంది. అలాంటి లక్షణాలున్న మనుషులు చాలా అరుదు. బుష్నెల్ మరణం ప్రపంచమంతటికీ లోటే. అమెరికా సైనికుడిగా ఆయనకు తమ సైన్యం లక్ష్యాలు బొత్తిగా నచ్చలేదు. ఇజ్రా యిల్కు మద్దతిసున్న పశ్చిమ దేశాల అబద్ధాల బండారాన్ని, మోసాన్ని ఆయన కనిపెట్టగలిగారు. ఈ దేశాలు చెప్పే పునర్నిర్మాణం ఎంత దగానో ఆయన గ్రహించారు. ఈ మారణకాండలో తాను భాగస్వామిని కాలేనని స్పష్టంగా చెప్పారు. పలస్తీనాలోని జనం వలసవాదుల చేతుల్లో పడుతున్న కష్టాలతో పోలిస్తే తన ప్రాణ త్యాగం అంత పెద్దదేం కాదు అని పేర్కొ న్నాడు. బుష్నెల్ అమెరికా వైమానిక దళం గూఢచార విభాగంలో పని చేసే వాడు. గాజా సొరంగాల్లో పలస్తీనియన్ల మీద మారణకాండ కొనసాగిం చింది నేరుగా అమెరికా సైనికులేనని ఆయనకు తెలుసు. ఇదే నిజమైతే గాజాలో తమ ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదని అమెరికా ప్రభుత్వం చెప్తున్నదంతా అసత్య ప్రచారమే అని తేలిపోతుంది. ఇరాక్ మీద దురాక్రమణ జరిగిన నేపథ్యంలో 2010లో చెల్సియ మానింగ్ బయట పెట్టిన ఘాతుకాల వివ రాలు ఇలాంటివే. పశ్చిమ దేశాల సంపూర్ణ సహకారంతోనే ఇజ్రాయిల్ గాజాలో విధ్వంసానికి, మానవ హననాకి పాల్పడుతోంది. ఇజ్రాయిల్కు ప్రధానమైన మద్దతు అమెరికాదే. మానవతావాద దృష్టితో కాల్పుల విరమణ పాటించాలని ఐక్య రాజ్య సమితిలో ప్రతిపాదించిన ప్రతి తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఇజ్రాయిల్కు వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం, లెక్కలేనన్ని ఆయుధాలు అమెరికా నుంచి అందుతూనే ఉన్నాయి. రక్త పిపాసకులైన అమెరికాకు మద్దతు పలికే దేశాలు చేస్తున్న పనీ ఇదే. ఎక్కడో ఒక చోట అల్లకల్లోలం సృష్టిస్తే తప్ప వారి దాహార్తి తీరదు. ప్రస్తుతం లక్షలాది మంది పలస్తీనియన్లు ఆకలికి అలమటిస్తుండగా ఇజ్రాయిల్ దళాలు శరణార్థుల శిబిరాలు, ఆసుపత్రులపై కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఆకాశం నుంచి జార విడిచే ఆహారపు పొట్లాలు అందు కోవడానికి పలస్తీనియన్లు పడుతున్న పాట్లు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ దృశ్యాలు చూస్తే గుండె ముక్కలవుతోంది. గత అక్టోబర్ ఏడు నుంచి ఇప్పటిదాకా 30,000 మంది పలస్తీనియన్లను హతమార్చారు. వీరిలో పిల్లలే పది వేల మంది. అమెరికాలో రాజ్యాధికారం చలాయించే రెండు ప్రధాన రాజకీయ పార్టీల వారు ఇప్పటికైనా తమ కుంభ కర్ణుడి నిద్ర నుంచి మేల్కొని 21 శతాబ్దంలోకెల్లా భారీ మారణకాండను నివారిస్తారేమో చూడాలి. బుష్నెల్ ఆత్మాహుతి చరిత్రలో ఒక కీలక ఘట్టం. కానీ ‘‘ మానవత’’ మిగిలి ఉందో లేదో, ఈ దారుణాలు అంతమై న్యాయమైన ప్రపంచం ఏర్పడుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
జి. నవీన్