ఎం కోటేశ్వరరావు
అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావటం లేదని పూరీ శంకరాచార్య, స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దీని మీద మోదీ భక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. వస్తే ఎంత రాకపోతే ఎంత, అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారని మాట్లాడుతున్నారు. రథóయాత్ర నిర్వహించి, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులను ఎదుర్కొన్న ఎల్కె అడ్వానీని ఆహ్వానిస్తూనే అసలు కార్యక్రమానికి రావద్దని నిర్వాహకులు ప్రకటించారు. చిత్రం ఏమిటంటే రామాలయంతో ఎలాంటి సంబంధంలేని, బాబ్రీ మసీదు కూల్చివేతను ఖండిరచిన సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలనూ ఆహ్వానించారు గానీ రావద్దని చెప్పలేదు. హాజరు కావటం లేదని చెప్పిన వారిమీద ప్రచారదాడులు చేస్తున్నారు. అడ్వాని(96), మురళీమనోహర్ జోషి(90) పెద్దవారు గనుక వారు వచ్చి ఇబ్బంది పడతారని అందువల్లనే రావద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వహిందూపరిషత్ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవగౌడకూ 90 ఏళ్లే అయినప్పటికీ ఆయనను వయసురీత్యా రావద్దని నిర్వాహకులు చెప్పలేదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టాలని జేడీఎస్ నాయకులు దేవగౌడ, కుమారస్వామి నిర్ణయించారు. అందుకే అయోధ్య రామాలయ రాజకీయం రంజుగా నడుస్తోంది అని చెప్పాల్సి వస్తోంది. ఈ మాట అంటే కొందరు మనోభావాలను ముందుకు తెచ్చుకొని బాధపడితే చేసేదేమీ లేదు. వయసురీత్యా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ శుభకార్యాలు జరిగినపుడు ఆహ్వానం పలకటం, వారు రాలేమని చెప్పినపుడు వీలు చూసుకొని రావాలని ఆకాంక్ష వెలిబుచ్చటం మన భారతీయ సంప్రదాయం. కానీ దాన్ని తుంగలో తొక్కి రావద్దని మేమే చెప్పామని నిర్వాహకులు చెప్పటాన్ని ఏ సంప్రదాయం అంటారో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. రథయాత్ర పేరుతో బీజేపీి నేత ఎల్కె అడ్వాని నిర్వహించిన కార్యక్రమం అది సృష్టించిన వినాశకర, అవాంఛనీయ ఉదంతాల గురించి తెలిసిందే. వారు వస్తారా లేదా స్పందన ఏమిటో చూడాల్సి ఉంది. ఒక వేళ వారు నిజంగా రాగలిగినా రానిచ్చేవారా అన్న సందేహాలు కూడా వారిని వద్దన్న తరువాత జనంలో తలెత్తాయి. తన దారిని సుగమం చేసుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ అధికారానికి వచ్చిన వెంటనే అడ్వాని, ఎంఎ జోషి వంటి వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అది ఇంతవరకు ఒక్కసారి కూడా సమావేశమైన సమాచారంగానీ, ఇచ్చిన మార్గదర్శనం గురించి గానీ ఎవరికీ తెలియదు. గుడులకు పరిమితం కావాల్సిన రాముడిని ఓట్ల కోసం వీధుల్లోకి తెచ్చారు.
మోదీని పొగడాలా?
ఆది శంకరాచార్య ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన మఠం ఒకటి. దాని అధిపతిగా ఉన్న స్వామి నిశ్చలానంద సరస్వతి(80)కి కూడా రామాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దాన్ని తిరస్కరించినట్లు స్వామి చెప్పారు. గత వారంలో ఒక టీవీ ఛానల్తో, అదే విధంగా మధ్యప్రదేశ్లోని రత్లాంలో జరిగిన ఒక సనాతన ధర్మ సభకు హాజరైనపుడు విలేకర్లతో చెప్పారు. తనకు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒక వేళ హాజరు కావాలని అనుకుంటే తోడుగా గరిష్టంగా ఒకరిని మాత్రమే తెచ్చుకోవాలని దానిలో పేర్కొన్నట్లు చెబుతూ ఒక్కరు కాదు వందమందిని అనుమతించినా ఆ రోజు తాను వెళ్లేది లేదని నిశ్చలానంద చెప్పారు. గతంలో కూడా వెళ్లానని, భవిష్యత్లో కూడా అయోధ్య వెళ్లి రాముడిని సందర్శిస్తానని చెప్పారు. రాముడి విగ్రహాన్ని శాస్త్ర విధి ప్రకారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు అలా జరగటం లేదన్నారు. తమ మఠపరిధి ప్రయాగ వరకు ఉందని అయినప్పటికీ తమ సలహా, మార్గదర్శనం కోరలేదని చెప్పారు. ఈ పరిణామాల గురించి ‘‘ నేను ఏ మాత్రం ఆశాభంగం చెందలేదు. ఒక శంకరాచార్యగా నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి ? మోదీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే చప్పట్లు కొట్టి పొగడాలా ?’’ అని ప్రశ్నించారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు తనను నరేంద్రమోదీ ఎలా కలిశారో నిశ్చలానంద గుర్తు చేసుకున్నారు. కరోనాకు ముందు యోగి ఆదిత్యనాథ్ ఏడాదికి రెండు మూడు సార్లు కలిసేవారు. విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ కనీసం 70సార్లు కలిశారని చెప్పారు. తీర్థస్థలాల అభివృద్ధి పేరుతో భోగస్థలాలుగా మార్చుతున్నారు. పర్యాటక కేంద్రాలుగా చేస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై సోమవారం మరోసారి నిశ్చలానంద తన వ్యతిరేకతను వెల్లడిరచారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 17న ఒడిషా ప్రభుత్వం ప్రారంభించనున్న శ్రీమందిర్ పరికర్మ ప్రకల్ప పథకం గురించి స్పందించారు. పుణ్య స్థలాలను విహార కేంద్రాలుగా మార్చటం అంటే వాటిని విలాస కేంద్రాలుగా మార్చటమే అన్నారు. హోటళ్లు, రవాణా రంగంలో ఉన్నవారు లబ్ధి పొందుతారు తప్ప ఆ కేంద్రాలకు ఉన్న ప్రత్యేకత తగ్గుతుందన్నారు. ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని, అయితే వెళ్లాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామాలయ ప్రతిష్టాపన గురించి చేసిన వ్యాఖ్యల మీద నిశ్చలానందపై కాషాయ మరుగుజ్జు దళాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నాయి.
ప్రభుత్వాలకు మఠాలు, దేవాలయాల మీద అదుపు ఉండకూడదని, ప్రతి మూలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆర్ఎస్ఎస్ను అనుసరిస్తున్నారంటూ తన మీద వచ్చిన విమర్శలను నిశ్చలానంద ఖండిరచారు, నేను అనుసరించటం లేదు, కావాలంటే వారే నా వెనుక నడవొచ్చు, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ నాముందు బాలగోపాలుడి మాదిరి కూర్చుంటారని అన్నారు. రామాలయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చూస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్న బీజేపీ ఒడిశాలో అక్కడి సిఎం నవీన్ పట్నాయక్ శ్రీమందిర్ పరిక్రమ రథాల ద్వారా ఎన్నికల రాజకీయం చేస్తున్నారని బీజేపీి నేత పృథీó్వరాజ్ హరిచందన్ ఆరోపించారు. జగన్నాధ సంస్కృతిని రూపుమాపేందుకు కుట్ర జరుగుతోందని, తన మాజీ ప్రైవేటు కార్యదర్శి ద్వారా ఒరియా పౌరుల మీద దక్షిణ భారత సంస్కృతిని బలవంతంగా రుద్దేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. శ్రీమందిర్ పథకం ఒక రాజకీయ నాటకమని, ఎన్నికల ముందు తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు తలపెట్టారని, 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును బీజేడీ తన ఎన్నికల ప్రచారానికి వినియోగించటం గర్హనీయమైన చర్య అన్నారు. జగన్నాథ దేవాలయం చుట్టూ 75 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించేందుకు యాత్రకు అవసరమైన పద్దతుల్లో తీర్చిదిద్దేందుకు అవసరమైన భూ, భవనాలను సేకరించారు. జనాలకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, సామాన్లు భద్రపరుచుకునే గదులతో పాటు భద్రతకు అవసరమైన కేంద్రాల వంటివి ఈ పథóకంలో ఏర్పాటు చేశారు. దీన్ని బీజేపీ రాజకీయం చేస్తున్నది.