ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలన్న దాన్ని పక్కకు పెట్టి సమయానుకూలంగా మాట మార్చుకునే సంస్కృతి వేళ్లూనుకున్నాక సత్యాన్వేషణ వృథా ప్రయాసే అనిపిస్తుంది. దేవుని బొమ్మ మీదనో, రాజ్యాంగం ప్రతి మీదనో చెయ్యిపెట్టి పక్షపాతం చూపకుండా ప్రజాసేవ చేస్తాననే ప్రమాణంతో పదవి స్వీకరిస్తున్న నాయకులు దాన్ని కేవలం పది నిముషాల తంతుగానే చూస్తున్నారు తప్ప తీవ్రంగా తీసుకోవడం లేదు. ‘ఆడి బొంకరాదు’ అన్న మాటపోయి ‘అబద్ధానికి జంకరాదు’ అని నోటి శబ్దంగా పలికే మాటతో మిగతా శరీరానికిగాని, మనసుకు గాని సంబంధం లేనట్లు ఉంటున్నారు.
‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి’ కాని మనం ఆచరించడానికి కాదనేది సత్యమని నమ్మబలుకుతున్నారు. సత్యవాక్కులతో సత్కీర్తి సంపాదించిన సహ సామ్రాజ్య చక్రవర్తి హరిశ్చంద్రుడిలా సత్యం కోసం తాము రాజ్యాలను పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేమని ఖరాఖండిగా చెపుతున్నారు. ప్రతిపక్షంలో ఉంటే పేదలను లక్షాధికారులను చేస్తామంటారు. అధికారంలోకి వస్తే లక్షలు సంపాదిస్తున్నారు కాబట్టి పేదరికమే లేదంటారు. అధికారానికి రావడమే ఎజెండాగా అడిగిన వారికి, అడగని వారికి కూడా తామే అన్నీ సమకూర్చే ప్రకటిత దైవంగా భావించుకుని మేనిఫెస్టోల్లో వరాలజల్లులు కురిపించి అధికారం వచ్చాక వాటిపై అబద్ధాల రంగుపూసి అంతా గత ప్రభుత్వపు తప్పులంటూ బూచి దయ్యాలను చూపిస్తుంటారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వమే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. పెద్దనోట్లు రద్దుచేసి దేశంలో ఉండే నల్లధనమంతా బయటకు తీసి అందరి ఖాతాల్లో జమచేస్తామన్న మాట కాలగర్భంలో కలిసిపోయింది. ప్రత్యేక హోదా కావాలని అరచి ప్రజలను రెచ్చగొట్టిన వాళ్లే దాన్ని అమలుచేసే అవసరమే లేదంటారు, లేక కుదరదంటారు.
మన రాష్ట్రంలో రాజధాని, పోలవరం లాంటివి కాకుండా మిగతా రాష్ట్రాలో అనేక ప్రాజెక్టుల్లాంటి పెద్ద విషయాలు కూడా మారిన ప్రభుత్వాల, కొత్త ప్రభుత్వాల మాటలకు పరిమితమై పాఠ్యపుస్తకాల్ల్లోని అంశంలా ఎంత చదివినా ఇంకెంతో మిగిలి చివరిపేజీకి చేరడంలేదు. చేరేందుకు దశాబ్దాలు దాటవచ్చు. ఈ దేశ పౌరులుగా దేశానికేమైనా సేవచేయాలనే విషయం మర్చిపోయి తాము సమాజానికి ఆదర్శంగా ఉండడంకంటే దీర్ఘకాలం అధికారంలో ఉండడం ఈ దేశానికే అవసరమంటారు. అధికారమే ఎజెండాగా ‘ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో అప్పటికా పాట పాడు’ అని తన మాటకు తానే కొత్త భాష్యం చెప్పేందుకు అలవాటు పడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని వారిని ప్రజలు కూడా గ్రహించి సర్దుకొని తాత్కాలిక ప్రయోజనంకోసం మాత్రమే వెతుక్కుంటున్నారు. ప్రతినేత పలుకుల్లో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుంటుంది. కానీ రాత్రికి రాత్రే భుజాన జెండాల రంగులు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోతుంటాయి. ధరలు నియంత్రిస్తామని, అంతా అభివృద్ది కనబరుస్తామనే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక అది పక్కనబెట్టి గత ప్రభుత్వాల నిర్వాకంవల్ల ఈ దేశం లేదా రాష్ట్రం ముప్పయ్యేళ్లు వెనక్కి వెళ్లిందని తాము తిరిగి ముప్పౖౖె Ûఏళ్లు పాలించకపోతే ప్రజలకు భవిష్యత్తే ఉండదని, గత ప్రభుత్వానికి ఓటేసినందుకు ప్రజల గతి ఇంతేనంటారు. కోర్టుల్లో భిన్నమైన తీర్పులు గమనించినా, చట్టాల్లో మార్పులు గమనించినా, ఎఫ్.ఐ.ఆర్లలో కూర్పులు, చేర్పులు గమనించినా నిరంతరం మాటలుమార్చి మాట్లాడుతున్న నేతలకు అనుకూలంగానో, ప్రతికూలంగానో గోచరిస్తుంటాయి. వ్యక్తిగత ఎజెండాల జెండాల నీడలు వ్యవస్థల నిష్షాక్షికత మీద దెబ్బతీస్తుంటాయి..
చెప్పింది చెప్పినట్లుగా ప్రజారంజకమైన పనులు అమలుచేసే నాయకత్వం క్రమేణా కనుమరుగవుతోంది. నిజాయతీగాఉంటే చాపకిందికి నీరు వస్తుందని దాన్ని అబద్ధాలతో అడ్డుకోవాలని చూస్తుంటారు. భిన్నమైన రాజకీయ పార్టీలలో విభిన్న వాదనలు కలిగి ఉండడం సహజం. మనుషులంతా ఒక్కటేననే భావన మనసులో లేనప్పుడు అస్మదీయులు, తస్మదీయులుగా విడగొట్టి విపరీతార్ధాలు చెబుతారు. కానీ, అధికారంలో ఉన్న వాళ్లు పార్టీలకతీతంగా ప్రజలందరినీ ఏక దృష్టితో మాత్రమే చూడాలి. కుల, మత, ప్రాంతీయ తత్వాలకు తావులేకుండా, ప్రధాని అయితే దేశం మొత్తానికి, ముఖ్యమంత్రులైతే రాష్ట్రం మొత్తానికి అనే భావన వారి మాటల్లో ప్రతిధ్వనించాలి. ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా అబద్ధాలతో దర్జాగా కాలక్షేపంచేస్తూ గడపాలనుకుంటే మాత్రం ఏదో ఒక సందర్భంలో నిజం నిప్పులా అనుభవిస్తున్న అవకాశాలను దహించివేస్తుంది.
- జోస్యుల వేణుగోపాల్
సెల్: 9440436806