ఎం కోటేశ్వరరావు
జులై 22 నుంచి ఆగస్టు ఆరు వరకు జరిపే కన్వర్`కావడి యాత్రల సందర్భంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వు అమలును సోమవారం సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది బీజేపీ హిందూత్వ ఎజెండాకు ఎదురు దెబ్బ. యాత్రలు జరిగే దారిలో ఉన్న దుకాణాలు, హోటళ్లు, పానీయాల దుకాణాల యజమానుల పేర్లను సంస్థల ముందు ప్రదర్శించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. వాటిలో హలాల్ ధృవీకరణ పత్రం ఉన్న పదార్థాలను విక్రయించరాదని కూడా పేర్కొన్నారు. యాత్రల పవిత్రతను కాపాడేందుకు అని చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తర్వుల్లో శాంతి భద్రతలను సాకుగా చూపారు. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం పేర్ల ప్రదర్శనకు బ్రేకు పడిరది. అయితే ఆహార పదార్ధాల స్వభావాన్ని వినియోగదారులకు ప్రదర్శించాలని కోర్టు పేర్కొన్నది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిరదని, సామాజికంగా వెనుకబడిన తరగతులు, మైనారిటీలను ఆర్థికంగా విడదీస్తుందని పిటీషనర్ల తరఫున వాదించిన సీయూ సింగ్ చెప్పారు. మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వి తన వాదనలను వినిపిస్తూ ‘‘ నేను గనుక పేరును ప్రదర్శించకపోతే నన్ను మినహాయిస్తారు, నేను పేరును ప్రదర్శించినా మినహాయిస్తారని’’ చెప్పారు. అయ్యప్ప, భవానీ వంటి దీక్షలు, కన్వర్(కావడి) యాత్ర వంటివి జనాల వ్యక్తిగత అంశాలు. ఇష్టమైనవారు పాటిస్తారు, కాని వారు దూరంగా ఉంటారు. వీరంతా నాస్తికులని గానీ పాటించేవారే పరమ ఆస్తికులని గానీ నిర్ధారించటానికి, ముద్రవేసేందుకు ఎవరికీ హక్కులేదు. పౌరహక్కుల పరిరక్షణ సంస్థ(ఎపీసీఆర్) పేరుతో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను సవాలుచేస్తూ సుప్రీం కోర్టు తలుపుతట్టింది. న్యాయమూర్తులు హృషికేశ్ రాయ్, ఎస్వీఎన్ భట్ ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా దుకాణాల యజమానుల మతపరమైన గుర్తింపు వెల్లడి కావటమేగాక ముస్లిం మతానికి చెందిన దుకాణాల యజమానులపై వివక్ష ప్రదర్శించటమే అని పిటీషన్లో పేర్కొన్నారు. ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ, తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని అధికారపక్షానికి స్పష్టం చేశాయి. కోర్టు ఆదేశాలతో దీని మీద చర్చ జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
బీజేపి మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, ఎల్జేపీి, ఆర్ఎల్డి పార్టీలు ఇలాంటి ఉత్తర్వులు తగవని చెప్పినా బీజేపీి ఖాతరు చేయలేదు. జనాలను మత ప్రాతిపదికన చీల్చే, ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే ఎజండాను అమలు జరిపేందుకే పూనుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిణామాల వెనుక ఉన్న కుట్రలేమిటి, ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. తాజా లోక్సభ ఎన్నికల్లో బీజేపీి ఆయోధ్యతో సహా అనేక చోట్ల చావుదెబ్బతిన్నది. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కారణమంటూ కేంద్ర పెద్దల మద్దతుతో బీజేపీి స్థానిక నేతలు ధ్వజమెత్తటమే కాదు, నాయకత్వమార్పు జరగాలని కోరుతున్నారు. మరో వైపున దానికి ప్రతిగా యోగి కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాటిలో కన్వర్ యాత్రల ఆదేశం ఒకటి. శివలింగం మీద తేలును చెప్పుతో కొట్టలేరు, చేతితో తొలగించలేరు అన్నట్లుగా కేంద్ర బీజేపీ నాయకత్వం ముందు పరిస్థితి ఉంది. ఇంతకూ ఈ యాత్రీకులు చేసేదేమిటి ? శ్రావణమాసంలో పవిత్రజలం పేరుతో గంగా నది నుంచి నీరు తెచ్చి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకంచేసి శివుని కృపకు పాత్రులౌతామనే నమ్మకాన్ని వెల్లడిస్తారు. జులై 22 నుంచి ఆగస్టు ఆరవ తేదీ మధ్య హరిద్వార్వద్ద ఉన్న గంగానదినుంచి తెచ్చే నీటి పాత్రలను కావళ్లలో పెట్టి తీసుకువస్తారు. కనుక దీనికి కావడి యాత్ర అనే పేరు వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వేర్వేరు మార్గాల్లో భక్తులు హరిద్వార్ వస్తారు. ఈ మార్గాల్లో యాత్రీకులకోసం వస్తువుల దుకాణాలు, ఆహార పదార్దాల హోటళ్లు. దాబాలు, బండ్లు ఏర్పాటు చేస్తారు. కాలినడకన, మోటారు వాహనాలు ఇలా ఎవరికి వీలైన పద్ధతుల్లో వారు ఈ యాత్రలో పాల్గొంటారు. 1980వ దశకం వరకు చాలా పరిమితంగా జరిగే ఈ క్రతువును క్రమంగా పెద్ద కార్యక్రమంగా మార్చారు. అయ్యప్ప దీక్షలకు పోటీగా అనేక దీక్షలను తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా అలాంటిదే.
దుకాణాలు, హోటళ్ల ముందు యజమానుల పేర్లకు బదులు ‘‘ మానవత్వం’’ అని ప్రదర్శించాలని ప్రముఖ నటుడు సోనూ సూద్ ఎక్స్లో సూచన చేశారు. దీని మీద బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ స్పందిస్తూ ఉమ్మిన ఆహారం, ఆ పని చేసేవారిని సమర్ధించటమే ఇదని ధ్వజమెత్తారు. ముస్లింలు తయారుచేసే ఆహారం, విక్రయించే పండ్లు మొదలైన వాటి మీద ఉమ్ముతారని, హలాల్ చేస్తారని, అపవిత్రమైన వాటిని హిందువులు బహిష్కరించాలని, హిందువుల పవిత్ర స్థలాలు, గుడులు, గోపురాలు ఉన్న ప్రాంతాలలో ముస్లింల దుకాణాలను అనుమతించరాదని, ఇప్పటికే ఉంటే ఎత్తివేయాలని హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. సాధారణ పౌరులెవరూ వాటిని పట్టించుకోవటం లేదన్నది కూడా ఎరిగిందే. అయోధ్యలో రామాలయం పేరుతో యోగి సర్కార్ బుల్డోజర్లతో కూలదోయించిన కట్టడాల్లో హిందువులవి కూడా ఉన్నాయి. అందుకే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేయటం, అభ్యర్థి ఓటమి తెలిసిందే. పలస్తీనాలో అరబ్బులపై దాడులు, మారణకాండ, స్వతంత్ర దేశ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ఇజ్రాయిల్ ఉత్పత్తులను బహిష్కరించాలని ముస్లిం, అరబ్బు దేశాలలో అనేక సంస్థలు గతంలో పిలుపునిచ్చాయి. వాటిని కాపీకొట్టిన కాషాయ దళాలు మనదేశంలో ముస్లింల వ్యాపారాలను దెబ్బతీసేందుకు వినియోగిస్తున్నాయి. అరబ్బు దేశాల చమురును బహిష్కరించమని చెప్పేందుకు వారికి నోరురాదు, ఎందుకంటే వారి యాత్రల వాహనాలు నడవాలంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఇంథనమే దిక్కు. అక్కడ పవిత్రత గుర్తుకు రాదు.
ఉమ్ముతారని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. నిజమే అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనేక బిర్యానీ హోటళ్లకు, రంజాన్ మాసం సందర్భంగా హలీం కోసం ఎగబడేవారిలో ఎక్కువ మంది ముస్లిమేతరులే ఎందుకు ఉంటున్నారు. దుకాణాలలో విక్రయించే వస్తువులు నాణ్యమైనవా కాదా, హోటళ్లలో వడ్డించే ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది గీటురాయిగా ఉండాలి తప్ప యజమానుల వివరాలు ఎందుకు? ఒకవేళ ముస్లిం మతానికి చెందిన వారు యజమానులుగా ఉంటే వాటిని బహిష్కరించాలని పరోక్షంగా చెప్పటమే ఇది. పేర్ల ప్రదర్శన ఒక్క ముస్లింలనే దెబ్బతీస్తుందా? హిందువులను కూడా నష్టపరుస్తుంది. మన సమాజంలో మత విద్వేషమే కాదు, కుల వివక్ష, విద్వేషం కూడా ఎక్కువే, అందునా దేశ ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలలో మరీ ఎక్కువ. దళితులు వివాహాల సందర్భంగా గుర్రాల మీద, ఇతరత్రా ఊరేగింపులు జరపకూడదని, ఎక్క కూడదని దాడులు చేసిన ఉదంతాలు ఎన్ని లేవు. దుకాణాలపై దళితులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక తరగతులకు చెందిన యజమానుల పేర్లను ప్రదర్శిస్తే ముస్లిం దుకాణాలపై అనుసరించే వైఖరినే మనువాద కులాల వారు పాటిస్తారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే అనేక చోట్ల గతంలో ఆర్యవైశ్య బ్రాహ్మణ హోటల్ అని రాసుకొనే వారు. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చు. వాటి స్థానలో రెడ్డి, చౌదరి హోటల్స్ పేరుతో ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నాయి తప్ప ఇతర కులాలను సూచించే హోటళ్లు ఎక్కడా కనిపించకపోవటానికి సమాజంలో ఇప్పటికీ ఉన్న చిన్నచూపు, వివక్షే కారణం. అదే ముస్లింల విషయానికి వస్తే మతవిద్వేషం. రాఘవేంద్ర, రామా, కృష్ణా, వెంకటేశ్వర విలాస్లు తప్ప ఎక్కడైనా అబ్రహాం, ఇబ్రహీం, ఏసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త విలాస్లను చూడగలమా?