శుభాకర్ మేడసాని
న్యూ దిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) దేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర వార్త ఛానల్. జర్నలిజంలో అత్యున్నత విశిష్ట పురస్కారాలు అనేకం అందుకున్న సంస్థ. ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రణయ్రాయ్ భార్య రాధిక రాయ్ 2019లో ముంబై విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద మీపై ఎల్వోసి జారి అయిందని రాయ్ దంపతుల ప్రయాణాన్ని అడ్డుకుంది. నిరాధారమైన అక్రమ కేసులు బనాయించి నన్ను బెదిరించడానికి పాలకుల పన్నాగం అని రాయ్ ఆరోపించారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఎన్డీటీవీ కొత్త యజమానిగా గౌతమ్ అదాని తెరమీదకు వచ్చారు.
అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జారీచేసే ఎల్వోసి(లుక్ అవుట్ సర్కులర్) ఇప్పుడు ప్రత్యర్థులను అణచివేయడానికి ఉపయోగించే దుర్మార్గ చర్య. వ్యవస్థలను, చట్టాలను భ్రష్టు పట్టించి వ్యక్తిగత కక్షలకు ఎల్వోసి దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. ఎల్వోసి అనేది ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్కు విదేశీ ప్రయాణాన్ని నిరోధించడానికి జారీచేసే నోటీసు. ఆర్థిక నేరస్తులు, తీవ్ర నేరఆరోపణ ఎదుర్కొనే వ్యక్తులు దేశంవిడిచి వెళ్లకుండా నిరోధించడం, నిర్బంధించడం ఎల్వోసి లక్ష్యం. మనదేశంలో మొట్టమొదటి ఎల్వోసి 1976లో జారీ అయింది. ఇతర దేశాల్లో ఎల్వోసిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అమెరికాలో ‘‘నో ఫ్లే లిస్ట్’’ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో ‘‘డిపార్చర్ ప్రొహిబిషన్ ఆర్డర్’’ అని పిలుస్తారు.
2019లో సినీ నటుడు శివాజీ అమెరికా ప్రయాణాన్ని దుబాయ్లో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వీసా రద్దు చేసి వెనక్కు పంపేశారు. కారణం టీవీ9 యాజమాన్యంలో తలెత్తిన గొడవలు. రవిప్రకాశ్, శివాజి మధ్య వ్యక్తిగత ఆర్థిక లావాదేవిల కారణంగా అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి తెలంగాణ పోలీసు లేదా ఆంధ్రా పోలీసు శాఖ నుంచి అధికారిక ఈ మెయిల్ కారణం అని శివాజీ మీడియాకు తెలిపారు. శివాజీ అమెరికా వెళ్లలేక పోయారు. ఎంత అమానవీయం వ్యక్తిగత కక్షలకు వ్యవస్థలను దిగజార్చి వ్యక్తి సేచ్ఛను అడ్డుకోవడం విచారకరం. ఇటీవల కాలంలో ఎల్వోసి జారీలో పారదర్శకతకు పాతర వేశారు. 1967 పాస్పోర్ట్ చట్టం అనుసరించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధీనంలో ఎల్వోసీ జారీచేసే అధికారం ఉంటుంది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరం అయితే పాస్పోర్ట్ రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. సీబీఐ, ఈడీ,ఎస్ఎఫ్ఎస్ఐఓ ( సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్), ప్రభుత్వ బ్యాంకులతోసహా మరో పదిహేను ప్రభుత్వ ఏజెన్సీలకు ఎల్వోసి జారీ అధికారం ఉంది. ఒకసారి ఎల్వోసి జారీచేస్తే జారీ చేసిన ఏజెన్సీ దాన్ని రద్దు చేసే వరకు లేదా కోర్టుతీర్పు ద్వారా రద్దుచేసే వరకు ఎల్వోసి నిరవధికంగా అమలులో ఉంటుంది. ఎల్వోసి జారీ ప్రక్రియ వ్యక్తిగతంగా సుదీర్ఘకాలం చిక్కులు తెచ్చిపెడుతుంది. అందువల్ల అసాధారణ పరిస్థితిలో మాత్రమే ఎల్వోసిీ జారీ చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో అందుకు విరుద్ధంగా విచక్షణారహితంగా వ్యక్తిగత కక్షతో ఎటువంటి నేరాలకు పాల్పడని సాక్షులపై కూడా ఎల్వోసి జారీ చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.
ఇటీవల మార్గదర్శి ఎండి సీిహెచ్ శైలజా కిరణ్ తన కుమార్తె డిగ్రీ స్నాతకోత్సవంకోసం అమెరికా వెళ్లారు. ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చేె సమయంలో ఏపీ సీఐడీ ద్వారా లుక్ అవుట్ నోటీసు జారీ చేయించారు. ఇక్కడ శైలజ ప్రయాణాన్ని అడ్డుకోవడానికి కాదు. ఆమెను విమానాశ్రయంలో అడ్డుకుని నిర్బంధించడానికి తద్వారా శైలజా కిరణ్ వ్యక్తిగత ప్రతిష్ట, మార్గదర్శి విశ్వసనీయత దెబ్బతీయటమే లక్ష్యంగా ఎల్వోసీి జారీ చేశారని శైలజ తెలంగాణ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అంతకు ముందు ఏపీి సీఐడీకి శైలజ అమెరికా నుంచి ఇమెయిల్ చేశారు. నాపై లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయడం నిజమేనా? మార్గదర్శిపై ఏపీి ప్రభుత్వం నమోదుచేసిన కేసుల్లో నేను విచారణకు సహకరిస్తున్నాను. కుమార్తె స్నాతకోత్సవానికి అమెరికా వచ్చాను అని తెలియజేశారు. ఆమె ఈమెయిల్కు సీఐడీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆఖరికి శైలజా కిరణ్ అమెరికా నుంచే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తే! కోర్టు అడిగితేగాని సీఐడీ ఎల్వోసి జారి చేసిన విషయం బయటపెట్టలేదు. కోర్టు రక్షణతో ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి స్వేచ్చగా ఇంటికి చేరుకోగలిగారు.
ఎల్వోసి జారీ చేసిన వ్యక్తులకు కనీస సమాచారం ఇవ్వకుండా విమానాశ్రయంలో అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవటం వ్యక్తి స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే . రాజకీయ కక్షపూరితంగా వ్యక్తుల స్వేచ్ఛను అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందనేది నిపుణుల అభిప్రాయం. చట్టం ఉద్దేశాలకు తూట్లు పొడుస్తూ సాధారణ పౌరులను హింసించడానికి నిర్బంధించి వారి జీవితాలను ఛిద్రం చేయటానికి ఎల్వోసి కారణం కాకూడదు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బొద్దులూరి యశస్వి అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే సీఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూడటానికి నాలుగు సంవత్సరాల తర్వాత స్వదేశానికి వచ్చాను. అమ్మను ఒక్కసారిచూసి మీవెంట వస్తాను అని యశస్వీ ఎంత వేడుకున్నా.. కాళ్లావేళ్లా పడినా కనికరించని సీఐడీ, ప్రశ్నిస్తే లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయడం సీఐడీ బరితెగింపునకు నిదర్శనం అని విశ్రాంత పోలీస్ అధికారులు వ్యాఖ్యానించారు.