ఇలా వివరించాడు కవి పసునూరి శ్రీధర్ బాబు ఫేస్బుక్లో ఈ మధ్యనే. అవును కవిత్వం ఎందుకని నాకూ చాలాసార్లు అనిపించింది. నాలుగు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో నాకు నేను చాలాసార్లే ఇలా ప్రశ్నించుకున్నాను. ఈ సందేహానికి మళ్లీ ఆ శ్రీధర్బాబే సమాధానం చెప్పారు..
‘‘నడవాలి కదా దారి లేకున్నా..
ఎక్కడి దాకా అని అడిగారు
దారి మధ్యలోనే పాదాలు తెగిపోతాయని తెలుసునని…’’
శ్రీధర్ బాబు సమాధానం.
ఇది చదివాక నా పాదాలు చూసుకున్నాను. చాలాసార్లు తెగిపోయిన గురుతులు కనిపించాయి. మళ్లీ ఓ పద్యం పువ్వుని చూడగానే అవే పాదాలు దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించాయి. ఇందుకే కవిత్వమంటే ఏమిటో బోధపడిరది. ఈ కవిత్వ ప్రయాణంలో బహుశా ప్రతి ఒక్కరికి ఇది అనుభవంలోదే. కవిత్వం ఏం చేస్తుందనే ప్రశ్న దాన్ని అనుభవించని వారి నుంచి ఎదురవుతుంది. ఇదో పిచ్చి… వీళ్లంతా పిచ్చిమాలోకం అని కూడా అనుకుంటారు. కవిత్వం చదివితే… రాస్తే ఏం మిగులుతుంది అని కూడా ప్రశ్నిస్తారు. ఆ పిచ్చిమాలోకంలో ఉన్న వారిని నిలదీస్తారు కూడా. దీనికి కూడా కవిత్వమే సమాధానం అంటున్నారు ఈ కవి శ్రీధర్ బాబు. ఇదిగో ఇలా మిగిలాయంటున్నారు.
‘‘ నా పాదాల కింద గుచ్చుకున్న ముళ్లు
మీ పాదాల కింద తడిసిన వెచ్చని మట్టి
చాలు కదా’’ అంటున్నారు.
కవిత్వ పిచ్చోళ్లకి ఇది చాలు కదా. ఆ పిచ్చిమాలోకంలో విహరించేందుకు ముళ్లు దిగిన పాదాలు అతని కవిత్వావరణ చుట్టూ తిరిగితే కలిగే ఆనందాన్ని దేంతో కొలుస్తాం. దేంతో తరిస్తాం. ఇక ఈ కవిత్వాన్ని ఆస్వాదించని వారి పాదాలకు అంటుకున్న తడిసిన వెచ్చని మట్టి వారు గుర్తించే దాకా వారిని వెంటాడుతూనే ఉంటుంది కదా…
ఈ కవిత్వ దారి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు వ్యర్ధమే కదా… ఎక్కడో ఒకచోట ముగుస్తుందని, అది ఎక్కడని అన్వేషించడం వినా కవులు చేసే పని ఏముంటుంది కనుక. ఈ శ్రీధర్ బాబు కూడా అదే పని చేస్తున్నారు. కవుల్లాగే పాఠకులు కూడా ప్రశ్నిస్తారు. పైగా శ్రీధర్ బాబు అన్నట్లు మా దగ్గర ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయంటారు. చిత్రమేమిటంటే ఈ కవులు కూడా పాఠకుల దగ్గరే తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఆ విషయం తెలుసుకునే ప్రయత్నంలోనే చాలా ఏళ్లు, వేల మైళ్లు ప్రయాణిస్తారు. అలా ప్రయాణిస్తూ పాఠకుల ప్రశ్నలకు ఇలా సమాధానం చెబుతారు. ఎలా అంటారా… ఇదిగో శ్రీధర్ బాబు అనే కవి ఇలా చెప్పినట్లుగా…
‘‘ షామ్స్ గోనె సంచీలో ముక్కలుగా సర్దుకుంటాడు
దమాస్కస్ ఎడారిలో రూమీ వెళ్తుంటాడు నీటి కుండను మోస్తున్న ఒంటెలా అన్నాను
కాదు, ఒయాసిస్సులా మిగిలిపోయాడు
దాహార్తుల లోకంలో’’
ఈ శ్రీధర్ బాబే కాదు… ఈ తెలుగులోనే కాదు… ప్రపంచంలోని కవులందరూ… అన్ని భాషల కవులు దాహార్తుల లోకంలో ఒయాసిస్సులా మిగిలిపోతారు కదా వొట్టి చేతులతో…
పద్యం దీపం కదా… అంటారు శ్రీధర్ బాబు. దీపమే కాదండీ బాబూ… దారీ తెన్నూ తెలియని ద్వీపం కూడా పద్యమే. అందుకే అందరూ కవిత్వాడవిలో కొత్త వర్షానికి పుట్టిన పిల్ల కాలువల్లా తలో దారి వెళ్లిపోతారంటాడు ఈ దారి తప్పిన శ్రీధర్ బాబు అనే కవి గారు.
నిజానికి ఈ పద్యం చదవక ముందు వరకూ శ్రీధర్ బాబు నాకు మామ. ఓరే అంటూ అని ప్రేమగా పరస్పరం పిలుచుకునేంత దగ్గరితనం. ఇదిగో ‘‘ఈ కవిత్వం ఎందుకంటే’’ పద్యం చదివిన తర్వాతే… నాలుగు రోజుల క్రితమే ‘‘గుండె పెండారం’’ అతని కాలికి తొడగాలనిపించింది. ఇక ఏకవచన ప్రయోగం ఈ కవి ముందు చెల్లదనిపించింది. ఈ శ్రీధర్బాబు అనే కవిలా ఎదిగితే… ఎదగగలిగితేనే ఏకవచన పిలుపు. అంత వరకూ ఈ కవి శ్రీధర్బాబు పాదాల దగ్గర కూర్చోవడమే. శరణుజొచ్చి…
ఇలాంటిదే మరో సందర్భం… మరో పద్యం…
మహిళాదినోత్సవం కదా…. ఉదయాన్నే తెరిచిన వాట్సాప్లో మరో పద్య పుష్పం కనిపించింది. బహుశా ఇదీ అముద్రితమే. అయినా మనసులో ముద్ర పడాలి తప్ప కాగితాలపై వచ్చేదంతా కవిత్వమెలా అవుతుంది. పోనీ, సామాజిక మాధ్యమాల్లో అంటారా… మయసభలో దుర్యోధనుడు రెండో సారి చూసిన సభ మధ్యమున కొలనులా ‘‘ఇదియునూ… అట్టిదియే’’ అనుకోవడం తప్ప మరేం చేయలేని బేలతనం. సరే, ఈ మహిళాదినోత్సవం ఉదయాన్నే కనిపించి… వరుసగా నాలుగు సార్లు చదివి ‘‘బలే ఉందమ్మా ‘‘ అని స్పందించిన పద్యం డాక్టర్ కాళ్లకూరి శైలజ గారు రాసిన మగువా… మగువా…!
‘‘నువ్వెక్కడున్నా తెలిసి పోతావు
కురవక ఆగిన కన్నీటి చుక్క
చెక్కిలి పై నీడలో దాచేస్తావు
నెమ్మదిగా వికసించే మొగ్గల పక్కన
నీ పాదముద్రలు
వెతికే వారికే దొరుకుతాయి’’ ఇలా ప్రారంభమైంది పద్యం. ఎంత చక్కగా ఉందో అనిపించింది ఈ నాలుగు లైన్లు చదివాక. స్త్రీలు ఎప్పుడు కురవక ఆగిన కన్నీటి చుక్కలే. కొంగును నోటికి అడ్డం పెట్టుకునో, చున్నీని నోట్లో కుక్కుకుంటునో కనిపిస్తారు మహిళలు. కన్నీళ్లను కూడా స్వేచ్ఛగా వదలలేని అభాగ్య స్త్రీలోకం. వారిని వెతకాలంటే సాధ్యం కాదు. వికసించే మొక్కల పక్కన వారు నడిచి వెళ్లిన పాదముద్రలుంటాయి. వాటిని పురుష సమాజమే కాదు… ఆ మహిళా సమాజం కూడా గుర్తించలేదు. ప్రతీ ఏటా వచ్చే మార్చి 8 వ తేది ఇందుకు మినహాయింపు. ఈ రోజొక్కటే వారికి మిగిలిన ఆలంబన. అవును, వారంతా కవయిత్రి శైలజగారన్నట్లు
‘‘విజయం కోసం ఎక్కాల్సిన మెట్లెన్నో
లెక్కపెట్టడం మానేసి
లాలిపాటలై పరవశిస్తారు’’
సరిగ్గా ఈ పద్యం చదువుతున్నప్పుడే ఓ చానల్లో మల్లె తీగ వంటిదీ మగువ జీవితం అనే పాట వస్తూంటూంది. ఇదీ కాకతాళీయమే. మహిళల కవిత్వమూ, జీవితమూ రెండూ కాకతాళీయం కావడమే విషాదం కదా…
ఈ పద్యాన్ని శైలజగారు ఇలా ముగించారు…
‘‘కింద పడ్డా పైకి లేచే బంతి’ అంటే
ఆశలు నెరవేరకపోయినా
అందంగా నవ్వే,
నీ మోము జ్ఞప్తికి రావాలి’’ ఈ చివరి లైన్లు చాలవూ మహిళల జీవితాల గురించి చెప్పడానికి.
శ్రీధర్ బాబు గారు అన్నట్లు… శైలజ గారు చెప్పినట్లు…
కవిత్వం ఎందుకంటే…. ఇదిగో ఇందుకే… అవును ఇందుకే…
సీనియర్ జర్నలిస్టు
సెల్: 99120 19929