ఉద్యోగ విరమణ జీవితంలో ఓ అనివార్య ఘట్టమే తప్ప ఇతరత్రా వ్యాపకాలు పెట్టుకోకూడదని, క్రియాశీలంగా ఉండకూడదనీ కాదు. ఉద్యోగ విరమణానంతరం చేసిన పనివల్లే నలుగురికీ తెలిసిన మనుషులుగా ఉంటారు. ఎన్నికల బాండ్ల గుట్టు బయట పెట్టిన వారిలో భారత నౌకా దళంలో ఏర్ కమాండోర్గా పని చేసిన లోకేశ్ బత్రా గురించి చెప్పిన తరవాతే మరెవరి పేరైనా ఎత్తాలి. లోకేశ్ బత్రా 1967 మే 22న భారత నౌకాదళంలో చేరారు. 1971లో భారత-పాకిస్థాన్ యుద్ధంలో పశ్చిమ ప్రాంత యుద్ధ రంగంలో పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ తరవాత ఆయన కావాలంటే మరేదో పని వెతుక్కోగలిగే వారే. లేదా ఏదో స్వచ్ఛంద సంస్థలో చేరగలిగే వారే. కానీ ఆయన తనకు ఇష్టమైన పని చేయాలనుకున్నారు. పరిపాలనలో జరిగే అక్రమాలను, అవకతవకలను బయట పెట్టడానికి 2005 నాటి సమాచార హక్కు చట్టాన్ని ఆయనంతగా సద్వినియోగం చేసిన వారు తక్కువ. 2017లో మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నికల బాండ్ల బండారం బయట పెట్టడానికి బత్రా కనీసం 80 సార్లు సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ.) కింద దరఖాస్తులు పెట్టారు. అందిన సమాచారం ఆధారంగా మరింత లోతుకెళ్లి చూడడానికి ఆయన మళ్లీ సమాచార హక్కు చట్టాన్నే ఆయుధంగా చేసుకున్నారు. ఆయన సేకరించిన సమాచారం కట్టలు కట్టలు పోగైంది. ఎన్నికల బాండ్ల దుర్నీతిని బయట పెట్టడానికి నిరంతరం పాటుబడ్డ రిపోర్టర్స్ కలెక్టివ్కు చెందిన నిథిన్ సేఠీ, తపస్య లాంటి వారితో పాటు ది న్యూస్ మినట్, హఫ్ పోస్ట్ లాంటి మీడియా సంస్థల పరిశోధ నాత్మక కథనాలకు ఆయన సంపాదించిన సమాచారమే ప్రధాన ముడి సరుకు. ఎన్నికల బాండ్ల చీకటి కోణాలను చీల్చడానికి ఎంతగా పోరాడారో, ఊరు పేరు బయట పెట్టకుండా తన మీద దాడి చేసే వారిని ఎదుర్కోవడానికీ బత్రా అంతకన్నా తీవ్ర పోరాటమే చేయవలసి వచ్చింది. ప్రభుత్వం ప్రజలదైనప్పుడు పరిపాలనలో దాపరికం ఉండకూడదన్నది ఆయన తపన. అందుకే నిరంతరం ఆర్.టి.ఐ.ని వినియో గించి పరిపాలనా విభాగాలు దాచే అంశాల గుట్టు విప్పారు. ఆయన కృషి కేవలం ఎన్నికల బాండ్లకే పరిమితం అయింది కాదు. హిందీలో ఆర్.టి.ఐ. చట్టానికి అవసరమైన మార్పులు చేయిం చడం, 2007లో జరిగిన నిఠారీ వరస హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో అక్రమాలను అడ్డుకోవడం, ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటన లకు ఎంత ఖర్చు అయిందో బయట పెట్టించడం, పి.ఎం.కేర్స్ ఫండ్, ప్రధానమంత్రి సహాయ నిధి లెక్కలు బయటపెట్టేట్టు చేయడంలో బత్రా విరామం లేకుండా శ్రమించారు. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే వారికి ప్రోత్సాహకాలు ఎందుకన్నది ఆయన ప్రశ్న. ఎన్నికల బాండ్లకింద ఇచ్చిన విరాళాలో 45 శాతం చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో ఇచ్చారని, దాపరికం ఏ మాత్రం ఉండకూడదంటే ఇవన్నీ డిజిటల్ విధానంలోనే చెల్లిం చేట్టు చేయాలని ఆయన ఎంత పోరాడారో! ఏ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది ప్రజలకు తెలియాలంటారు బత్రా.ఎన్నికల బాండ్ల వల్ల ద్రవ్య అక్రమ చెలామణి పెరుగుతుందని, విరాళాలు ఇవ్వడంకోసం డొల్ల కంపె నీలు తామర తంపరగా పుట్టుకొస్తాయని బత్రా ఇంతకాలం చెప్తున్న మాట అంతిమంగా నిజమైంది. ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ ఆస్తిపాస్తులు, అప్పుల వివరాలు ఎన్నికల కమిషన్ కు అందజేస్తున్నప్పుడు ఎన్నికల్లో పెట్టే ఖర్చు తమకు ఎక్కడినుంచి అందిందో కూడా చెప్పాలన్న బత్రా వాదన చివరకు నిజమైందిగా. మొత్తం 20వేలపై చిలుకు ఎన్నికల బాండ్లలో 95 శాతం బాండ్లు కోటి రూపాయలకన్నా ఎక్కువ విలువైన వేనని ఆయన లాగినా కూపీ ఒక్కటి చూస్తే ఎక్కువగా రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చింది ఎవరో తేలిపోతోంది. వీరి పేర్లు బయటకు రాకూడా ఉండడానికి మోదీ ప్రభుత్వం వేయని పాచికలేదు. వీటన్నిం టినీ ఎండగట్టింది లోకేశ్ బత్రా. ఆర్.టి.ఐ. ద్వారా మనం పరిపాలనలో భాగస్వాములం కావచ్చునని, ఎన్ని కల ప్రక్రియను సంస్కరించవచ్చునని బత్రా గట్టిగా నమ్ముతారు. ఎన్నికల బాండ్ల కూపీ లాగడానికి ముందే ఆర్.టి.ఐ. చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రభు త్వం దాచే రహస్యాలను బయట పెట్టడానికి బత్రా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజల చేతిలో పరమ ఆయుధం అయిన ఆర్.టి.ఐ. చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం పన్నిన కుట్రలెన్నో గమనిస్తే బత్రాలాంటి వారి అవసరం ఎంతుందో అర్థం అవుతుంది. రహస్యాలు వెల్లడ య్యేట్టు చేయడానికి ప్రభుత్వంతో ఎందుకు గొడవ తెచ్చుకుంటారు అని అడి గితే అది తన తత్వం అంటారు బత్రా. నౌకాదళంలో పని చేసేటప్పుడూ ఇలాగే ఉండేవాడినంటారు. వ్యవస్థలో మార్పులు రావాలంటారు. పరిపాల నలో భాగస్వాములం కావా లంటే సమాచారం కావాలి కదా అని ఉద్వేగంగా అడుగుతారు. ఆర్.టి.ఐ.వల్ల అనేక మార్పులు వచ్చాయనీ ఎవరో ఒకరు ఈ పని చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తారు. ప్రశ్న ముందు పుట్టి ఆయన తరవాత పుట్టినట్టున్నారు. అన్యాయాన్ని ఎదిరించడమే బత్రా జీవ లక్షణం. ఆయన వాడిన ఆయుధమల్లా ఆర్.టి.ఐ. చట్టమే. వయోభారం ఆయన వెన్నుముకను బలహీన పరచలేక పోయింది. ఎన్నికల బాండ్లు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు నిష్కర్షగా చెప్పగలిగిందంటే దాని వెనక లోకేశ్ బత్రా లాంటివారి నిస్వార్థ కృషి, పట్టుదల, నిజాయితీయే కారణం. డబ్బు సంచుల బలంతో ఎన్నికలలో విజయం సాధించాలన్న మోదీ కుట్ర సాగకుండా చేయడంలో బత్రా పాత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. అందరూ ఆయనలా పోరాడలేక పోవచ్చు. కానీ అలాంటి వారి పాత్రను గుర్తించ డానికి, ప్రోత్సహించడానికి ఏ త్యాగమూ అక్కర్లేదు. సత్యనిష్ఠ ఉంటే చాలు. సత్యం కోసం పోరాడాలంటే త్యాగ బుద్ధి, ఓరిమి కావాలి. కొరతంతా దానిదే. ఆయన పోరాటాన్ని సహించలేని వారు గౌరీ లంకేశ్కు ఏ గతి పట్టిందో తెలుసుగా అని హెచ్చరించిన సందర్భాలున్నాయి. కానీ ఉద్యోగ విరమణ చేసి రెండు దశాబ్దాలు దాటినా ఆయనలోని పోరాట స్ఫూర్తి చల్లారలేదు. బాండ్ల విషయంలో నిజం దాస్తున్నది అత్యున్నత స్థానంలో ఉన్నవారేనని బత్రా చెప్తారు. ఆయన గురి ఎవరి మీదో విప్పి చెప్పనవసరం లేదుగా!
` అనన్య వర్మ