మక్కెన సుబ్బారావు
నాలుగునెలల్లో సార్వత్రిక ఎన్నికలు. మూడవసారి మోదీఈ పర్యాయం 400 సీట్లు. జనవరి 22న అయోధ్యలో రామజన్మభూమిగా విశ్వాసముంచిన ప్రదేశంలో కొత్తగా నిర్మించిన భవనమైన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట, ఆహుతుల సమక్షంలో ఆలయానికి భారత ప్రధాని నరేంద్రమోదీ దివ్యహస్తాలతో ప్రారంభోత్సవం. రాజ్యం కార్యకలాపాల నుంచి మతాన్ని దూరంగా పెట్టిన భారత లౌకిక రాజ్యాంగానికి ఇది ఉల్లంఘన కాదా! భారత ప్రజలు తమకు తాము సమర్పించుకున్న ‘సర్వసత్తాక సోషలిస్టు సెక్యులర్, ప్రజాస్వామిక రిపబ్లిక్’ రాజ్యాంగంపై ప్రమాణంచేసి ఏలుబడి సాగిస్తున్న నరేంద్రమోదీ రామాలయం ప్రారంభోత్సవమనే ఈ హైందవ మత మహాక్రతువుకు ముఖ్య అతిధి. మతం వ్యక్తిగతం. ఇష్టమొచ్చిన మతావలంబనకు రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. నరేంద్రమోదీ ఒక వ్యక్తి కాదు, ప్రధానమంత్రి అనే ఒక అత్యున్నతాధికార వ్యవస్థకు ప్రతినిధి. భారతదేశం ఏకజాతి, ఏకమతం దేశం కాదు. పుట్టుకతోనే హిందువులుగా పరిగణించే వారిలోనే ఎన్నో మతాలు, శాఖలతోపాటు భౌతికవాదులు, నాస్తికులు సైతం ఉన్నారు. ఈనాడు భారతదేశంగా పరిగణిస్తున్న భూభాగాన్ని మహమ్మదీయ చక్రవర్తులు, క్రైస్తవ వలస పాలకులు అనేక వందల సంవత్సరాలు పరిపాలించినందున ఆ మతాలను స్వీకరించిన, ఆచరిస్తున్న జనాభా పెద్దసంఖ్యలోనే ఉన్నారు. హిందువే అయినప్పటికీ కోట్లాది దళితులకు, గిరిజనులకు ఆలయ ప్రవేశమే నిషిద్ధం. ఎన్నో నిరంకుశ చట్టాలు అమలుచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆ నిషేధాన్ని తీవ్రమైన అమానుషనేరంగా పరిగణిస్తూ ఒక చట్టాన్ని ఎందుకు తేలేదు? ఆయన వెనుకబడిన తరగతి సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ ననాతన ధర్మానికి నిబద్ధుడైన వ్యక్తి. అత్యధిక మత ధర్మాలను ప్రజలు విశ్వసించి ఆచరించేటట్లు చేయటానికి పూర్వులు సృష్టించినవే పురాణాలు. మహాకవి వాల్మీకి ‘తులసీ రామాయణం’ పేరుతో రచించిన శ్రీరామగాథ వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు. సమాజాన్ని సన్మార్గంలో పెట్టడానికి శ్రీరామచంద్రుణ్ణి పురుషోత్తమునిగా, ఆదర్శ పురుషునిగా, జగదభిరాముడిగా సృష్టించారు. రామనామం వేల సంవత్సరాలుగా గ్రామగ్రామానికీ వ్యాప్తి చెందింది. మానవునిగా జన్మించిన రాముడు భగవంతుడి స్థానం పొందాడు. రామగాథ చెప్పని, చూడని కళారూపము, గుడిలేని వాడలేదు, శ్రీరామ పట్టాభిషేక పటంలేని హిందూ ఇల్లు ఉండదు. రాముణ్ణి సర్వులకూ ఏటా గుర్తుచేసే శ్రీరామనవమి ఉత్సవాలు ఉండనే ఉన్నాయి. ఇంతగా ప్రాచుర్యంలో ఉండే రామచంద్రునికి ఇప్పుడీ వైభవోపేత రాజకీయ సమ్మిళిత మహోత్సవం ఎందుకు అవసరమైంది? రామజన్మభూమి వివాదం బాబ్రీ మసీదు
రామజన్మభూమి వివాదం కేసు సూక్ష్మంగా ఇలా ఉంది. బాబర్ సైన్యాధిపతి మీర్బకీ 1529 సంవత్సరంలో బాబ్రీమసీదు నిర్మించాడు. 1885లో కోర్టు వివాదం చేశాడు. ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అనుమతి నిరాకరించాడు. రఘుబీర్దాస్ ఇండియాకు బ్రిటిష్ కార్యదర్శికి వ్యతిరేకంగా ఫైజాబాద్ కోర్టులో టైటిల్ సూట్ (భూమిపై హక్కు దావా) దాఖలు చేశాడు. కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. 1949 డిసెంబరు అర్థరాత్రి ఒక వ్యక్తి రామలక్ష్మణుల విగ్రహాలు రహస్యంగా తీసుకెళ్లి బాబ్రీ మసీదు మధ్య డోము కింది భాగంలో పెట్టాడు. భగవానుడు వెలిశాడంటూ హిందువులు పూజలు చేయసాగారు. ప్రభుత్వం దాన్ని ‘‘వివాదప్రాంతంగా’’ ప్రకటించి ప్రవేశద్వారానికి తాళాలు వేయించింది. అది రామజన్మభూమి అంటూ ఆ లల్లాలో పూజలకు అనుమతి కోరుతూ, గోపాల సింగ్ విశారద్, పరమహంస రామచంద్ర దాస్ అనే ఇరువురు హిందువులు 1950లో రెండు కేసులు దాఖలుచేయగా, 1959లో నిర్మోహి అఖారా మూడవ హిందూసూటు దాఖలు చేశారు. కాగా యూపీ సున్నీ వక్ఫ్బోర్డు బాబ్రీమసీదు నుంచి విగ్రహాలు తొలగించాలని, మసీదు స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ 1961లో కేసు దాఖలు చేసింది. 1984లో విశ్వహిందూ పరిషత్ రామజన్మభూమి ఉద్యమంకోసం ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ ప్రచారోద్యమానికి బీజేపీ నేత ఎల్కె అద్వాణీ నాయకుడు. 1986 ఫిబ్రవరిలో జిల్లా జడ్జి ఆదేశాలపై గేట్లు తాళాలు తీశారు. హిందువులు పూజలు చేయసాగారు. 1989 నవంబరు 9న వివాదప్రదేశం సమీపంలో వీహెచ్పీ శిలాన్యస్ (భూమిపూజ) నిర్వహించేందుకు ప్రధాని రాజీవ్గాంధీ అనుమతించారు. నిరసనగా ముస్లింలు బాబ్రీమసీదు యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. 1989లో భూమిపై హక్కు కేసులన్నీ అలహాబాద్ హైకోర్టుకు బదిలీఅయ్యాయి. 1989 ఎన్నికల్లో రాజీవ్గాంధీ అయోధ్యలోని శిలాన్యాస్ ప్రదేశంనుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రామరాజ్యం స్థాపిస్తామన్నారు. కాని ఓడిపోయారు. అటు తర్వాత విశ్వనాథ్ ప్రతాప్సింగ్ ప్రభుత్వం వెనకబడిన తరగతులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ మండల్ కమిషన్ నివేదికను అమలు జరపటంతో అగ్రవర్ణాలు విలవిలలాడిపోయాయి. అప్పుడు బీజేపీ రామజన్మభూమి సమస్యను తమ ఎజెండాలోకి తీసుకుంది. 1990 సెప్టెంబరు 25న ఎల్కె అద్వాణీ రామజన్మభూమి ఉద్యమానికి మద్దతుగా సోమనాథ్(గుజరాత్) నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. 2010 సెప్టెంబరు 10న హైకోర్టు లక్నో బెంచి అయోధ్య వివాదప్రదేశాన్ని 2:1 దామాషాలో ముస్లింలు, హిందూ కక్షిదారులకు పంచింది.సుప్రీంకోర్టు 2011 మే నెలలో అలహాబాద్ హైకోర్టు తీర్పును నిలుపుదలలో పెట్టింది. ప్రధాన న్యాయమూర్తి ఖెహార్ 2017 మార్చి 21న కక్షిదారులు కోర్టు వెలుపల పరిష్కారం కుదర్చుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2017 ఆగస్టు 11న విచారణ ప్రారంభించింది. 2019 జనవరి 8న సీజెఐ రంజన్గొగోయి ఐదుగురు జడ్జీల బెంచి ఏర్పాటుచేశారు. 2019 మార్చి 8న కోర్టు పర్యవేక్షణలో మధ్యవర్తిత్వం ఆదేశించింది. ఈ బెంచి టైటిల్ వివాదం పరిష్కారం బదులు విశ్వాసాన్ని గౌరవిస్తూ ‘భగవాన్ రామ్ ఆ ప్రదేశంలో జన్మించాడన్న’’ హిందువుల విశ్వాసం వివాదంలేనిది. అందువల్ల సంకేతప్రాయంగా ఆ భూమిపై స్వామ్యం ఆయనదేనని ‘‘కోర్టుతీర్పుగా’’ ధర్మాసనం 2019 నవంబరు 9న ఏకగ్రీవంగా చెప్పింది. రామమందిర్ నిర్మాణానికి మూడునెలలలోపు ఒక ట్రస్టు ఏర్పాటు చేయాలని, ట్రస్టీల బోర్డు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశంలో 5 ఎకరాల స్థలం మంజూరు చేసింది. భారతదేశ చరిత్రలో అతి సుదీర్ఘమైన వివాదం పరిసమాప్తం అయింది. దేశం ఊపిరి పీల్చుకుంది. ఈ తీర్పును సుసాధ్యం చేసిన రంజన్ గొగోయి కొద్దికాలంలోనే రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
వర్తమానంమహోత్సవం వర్తమానంలోకి వస్తే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. రామచరిత్ర ఉట్టిపడుతున్న రైల్వేస్టేషన్, విమానాశ్రయాలను ప్రధానమంత్రి మోదీ గత నెల 30న ప్రారంభించారు. అయితే బీజేపీ చేస్తున్న హడావుడి ఇది ఆధ్యాత్మిక కార్యక్రమమా లేక కాషాయమార్క్ రాజకీయ కార్యమ్రమా అనే సందేహం కలిగించక మానదు. ప్రధానమంత్రి డిసెంబరు 30న అయోధ్య నుంచి దేశప్రజలకిచ్చిన పిలుపు చూడండి. ‘‘ఆలయ ప్రాణ ప్రతిష్టరోజు భారతీయులు శ్రీరామజ్యోతి వెలిగించాలి. దీపావళి లాగా జరుపుకోవాలి. ఈ చారిత్రక గడియ అదృష్టవశాత్తు మనందరి జీవితాల్లోకి వచ్చింది. జనవరి 14 నుంచి 22వరకు ఆలయాలు, యాత్రాస్థలాలను శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టండి. భగవాన్ రాముడు అరుదెంచుతున్నప్పుడు చుట్టుపక్కల చెత్తాచెదారం ఉండరాదు’’. బాలరాముని విగ్రహ ప్రతిష్టను దేశం నలుమూలలకు తీసుకెళ్లే వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మంగళవారం సమావేశం జరిపారు. 22వ తేదీకి ముందు, అన్ని జిల్లాల్లో ఆలయాలను శుభ్రపరచడం, ఆ తర్వాత యాత్రికులను అయోధ్య పంపడంకోసం 400పట్టణాల నుంచి రైళ్లు ఏర్పాటుచేసే కార్యక్రమాలు చేపడతారు. పార్టీని ట్రావెల్ ఏజన్సీగా మారుస్తారన్నమాట! ఇదంతా ఎందుకు? మే
జూన్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టే సాధనంగా అయోధ్య రామాలయ కార్యక్రమం చేపడుతున్నారు. ఒక ఐచ్ఛిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాజకీయ స్వప్రయోజనానికి ఉపయోగించుకుంటున్నారు. తాము ఈ పదేళ్ల అధికారకాలంలో చేసిన రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రజావ్యతిరేక చర్యలన్నిటినీ ప్రజలు మరచిపోయి రాముడిలో మోదీ ముఖం చూసి తమ పార్టీకి మళ్లీ పట్టం కట్టాలని ఆశిస్తున్నారు. ప్రజాతంత్రశక్తులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలను చైతన్యపరచాలి. మతం వేరు, రాజకీయం వేరు! లౌకికతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం!
సీనియర్ జర్నలిస్టు
ఫోన్: 9390683756