విశాలాంధ్ర – బెలగాం : కీటకజనిత వ్యాదుల నియంత్రణకు వార్షిక కార్యాచరణ ప్రణాళికపై విజయవాడలో నిర్వహించిన సమావేశానికి పార్వతీపురం మన్యం జిల్లా నుండి జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డాక్టర్ టి. జగన్ మోహనరావు తన వైద్య బృందంతో హాజరయ్యారు. సోమవారం, మంగళవారం రెండు రోజులు ఎన్సివిబిడిసి ఉపసంచాలకులు ఎటి రామనాథరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మలేరియా, డెంగ్యూ మొదలైన కీటకజనిత వ్యాదుల నియంత్రణకు 2024 సం.పు కార్యాచరణ, ప్రణాళికా విధి విధానాలను వివరించారని ఆయన తెలిపారు. గత మూడు సంవత్సరాల జిల్లా నివేదికల ఆధారంగా ఈ సంవత్సరం వ్యాధికాలం (ఎపిడెమిక్ పీరియడ్) అంతటికీ సరిపడా కీటకనాశన మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్లు, వ్యాధి నివారణ మందులు, ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ నిర్వహించాల్సిన గ్రామాలు తదితర వివరాల సమగ్ర నివేదికలు ధృవీకరించబడినవని అన్నారు. క్షేత్ర స్థాయిలో దోమలు వృద్ధి చెందే స్థావరాలను గుర్తించడంపై ఎక్కవగా దృష్టి సారించాలని, ఫీవర్ సర్వే చేపడుతూ ఉండాలని, సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందితో కలసి నివారణ చర్యలు చేపట్టాలని, డ్రైడే పాటించేలా ప్రజల్లో మరింతగా అవగాహన పెంపొందించాలని, అందుకు అవసరమైన వినూత్న పద్ధతులు అవలంబించాలని తెలిపారు. అనంతరం జిల్లా నివేదికల రికార్డులు పరిశీలించారని తెలిపారు. ఈ సమావేశానికి ఆయతో పాటు జిల్లా నుండి ఎఎంఓ సూర్యనారాయణ, జిల్లా విబిడి కన్సల్టెంట్ రామచంద్ర హాజరయ్యారని తెలిపారు.