లీడ్స్ : భారత`ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. తొలిరోజు టీమిండియాను 78 పరుగులకే కుప్పకూల్చిన రూట్సేన తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా పురోగమిస్తోంది. కడపటి వార్తలందే సరికి జట్టు స్కోరు 360/5 వద్ద ఉండగా టీమిండియాపై 282 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. కెప్టెన్ జో రూట్ మరోమారు సెంచరీతో చెలరేగాడు. మలాన్ 70 పరుగులు, బెయిర్ స్టో 29 పరుగులు చేశాడు. రూట్ (105), బట్లర్ (3) క్రీజులో ఉన్నారు. మూడు రోజుల ఆట మిగిలి ఉండడంతో భారీ స్కోరు తప్పేలా లేదు. అలాగే మ్యాచ్ ఫలితం తేలడం కూడా పక్కా అని తేలిపోయింది. తొలి రోజు చివరి రెండు సెషన్ల నుంచి వికెట్ల కోసం తంటాలు పడుతున్న భారత బౌలర్లు గురువారం తొలి సెషన్లో రెండు వికెట్లు తీసినప్పటికీ అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యారు. ఓపెనర్లు ఇద్దరూ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలాన్, కెప్టెన్ జో రూట్ క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లకు చిక్కకుండా జాగ్రత్తగా ఆడుతూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ బర్న్స్, హసీబ్ హమీద్లు నిలకడగా ఆడి జట్టుకు కీలక భాగస్వామ్యాన్ని అందించారు. రోరీ బర్న్స్ 61(153), హమీద్ హసీబ్ 68(195) పరుగులు చేశారు. అయితే షమి వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. 49వ ఓవర్లో షమి వేసిన బంతికి రోరీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మలాన్తో కలిసి హసీబ్ భాగస్వామ్యం నిర్మించసాగాడు. కానీ జడేజా బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యి హమీద్ పెవిలియన్ చేరాడు. షమీ 3, సిరాజ్, జడేజా చెరొక వికెట్ పడగొట్టారు.