చెలరేగిని ఇంగ్లాండ్ పేసర్లు
మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 78 పరుగులకు ఆలౌట్
లీడ్స్ : భారత`ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య బుధవారంనాడిక్కడ ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 78 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కోహ్లీసేనకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. చివరి రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు చేసిన కేఎల్ రాహుల్ డక్కౌట్గా వెనుదిరిగాడు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతికి కీపర్ బట్లర్కి క్యాచ్ ఇచ్చాడు. రాహుల్ ఔటైన కొద్దిసేపటికే టీమ్ఇండియాకు అండర్సన్ మరో షాక్ ఇచ్చాడు. పుజారా బట్లర్కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(7) సైతం అండర్సన్ బౌలింగ్లోనే బట్లర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రహానె(18) కాసేపు నిలకడగా ఆడినా.. రాబిన్సన్ బౌలింగ్లో బట్లర్ చేతికే చిక్కాడు. దీంతో భోజన విరామ సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ, పంత్ ఇన్నింగ్స్ను నిలబెడతారన్న భారత అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. భోజన విరామం అనంతరం కాసేపటికే పంత్ (2) రాబిన్సన్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం కుదురుగా ఆడిన రోహిత్ కూడా పుల్ షాట్ ఆడబో యి ఓవర్టన్ బౌలింగ్లో రాబిన్సన్కు సునాయాస క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత జడేజా, షమీ, బుమ్రా, సిరాజ్, పెవిలి యన్కు క్యూ కట్టడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ల 78 పరుగులకు ముగిసింది. భారత బ్యాట్స్ మన్లలో ముగ్గురు ఆటగాళ్లు.. కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా డకౌట్ కాగా, ఆరుగురు ఆటగాళ్లు పుజారా (1), కోహ్లీ (7), పంత్ (2), జడేజా (4), ఇషాంత్ శర్మ (8) సిరాజ్ (3) పట్టుమని పది పరుగులు కూడా చేయలేక పోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ తొలుత భారత టాపార్డర్ను కుప్పకూల్చగా, ఆ తర్వాత రాబిన్సన్, శామ్ కరన్, క్రెయిగ్ ఓవర్టన్లు మిగతావారి పని పట్టారు. పోటాపోటీగా వికెట్లు తీస్తూ టీమిండియా బ్యాటింగ్ను కుప్పకూల్చారు. వీరిలో అండర్సన్, ఓవర్టన్ చెరో మూడు వికెట్లు తీయగా, రాబిన్సన్, శామ్ కరన్ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బట్లర్ ఐదు క్యాచ్లు అందుకోవడం విశేషం. టీమిండియా కేవలం 40.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (6), హసీబ్ హమీద్ (15) క్రీజులో ఉన్నారు.