విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో 1997-98 విద్యార్థుల బ్యాచ్ వారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ అపూర్వ కలయికలో పూర్వ బాలుర విద్యార్థులు 119, గర్ల్స్ 28 మంది హాజరు కావడం జరిగింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత అందరూ ఒకచోట కలవడం అందరిని ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆనాటి తీపి గుర్తులను, జ్ఞాపకాలను గుర్తు చేసుకొని, తమ సంతోషాన్ని ఒకరినొకరు పంచుకున్నారు. గురువులైన సత్యనారాయణ బాబు, శ్రీనివాసరావు, నాగభూషణ, యజ్జన్న, పార్థసారథి, కృష్ణప్రసాద్, డ్రిల్ మాస్టర్ లక్ష్మీనారాయణ లను ఘనంగా సన్మానించారు. తదుపరి గురువులు మాట్లాడుతూ 27 సంవత్సరాల తర్వాత తమను ఈ విధంగా ఆహ్వానించి సత్కరించడం అనేది జీవితంలో మరుపురాని రోజుగా తాము గుర్తించుకుంటామని తెలిపారు. ఆనాటి పూర్వ విద్యార్థులు తమ తమ చదువు స్థాయిని బట్టి ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా తదితర స్థానాల్లో ఉంటూ మంచి మార్గాన పయనిస్తుండడం శుభదాయకమని తెలిపారు. చదువుకున్న పాఠశాలను గుర్తుపెట్టుకొని ఆ సంవత్సరములో ఉన్నటువంటి బాలురు, బాలికలను ఒకే వేదిక మీదకు తెచ్చి, సంబరాలు జరుపుకోవడం జీవితంలో అందరికీ మరపురాని రోజు అని తెలిపారు. తదుపరి పూర్వ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలలో, ఉపాధ్యాయుల యొక్క చదువుతో తాము జీవితంలో మంచి స్థానంలో స్థిరపడటం జరిగిందని తెలిపారు. అటువంటి గురువులను, మా తోటి విద్యార్థులను ఒకే వేదిక మీద ఒకే రోజు సంబరాలు జరుపుకోవడం మా జీవితంలో మరుపు రాని రోజు అని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం గురువులతో సెల్ఫీలతో పాటు ఫోటోలను తీసుకొని, తమ జీవితములో గుర్తుండేలా పెట్టుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయుల యొక్క ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభ వారిని ఎంతగానో సంతోషింపజేసింది. ఈ కార్యక్రమంలో 147 మంది పూర్వ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని సభను విజయవంతం చేశారు.