విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గాంధీనగర్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఉన్న వర్షపు నీటిని తొలగించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి బ్రిడ్జి కింద వర్షం నీరు అంతా అధికంగా చేరుకోవడంతో కొత్తపేట నుంచి పట్టణానికి రాకపోకలు సాగించే పాదాచార్యులు వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజుల కిందటే రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయడం జరిగిందని, అయితే బ్రిడ్జి కింద రోడ్డు పూర్తిస్థాయిలో వేయకపోవడంతో అనేక ఇబ్బందులకు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు గానీ, రైల్వే అధికారులు గానీ వెంటనే స్పందించి బ్రిడ్జి కింది ఉన్న వర్షపు నీటిని తొలగించి న్యాయం చేయాలని కోరుతున్నారు.