మండల విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టుదలతో చదివితే విజయం విద్యార్థులదే అవుతుందని ఎంఈఓ-1. రాజేశ్వరి దేవి, ఎంఈఓ-2 గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని సంజయ్ నగర్ లో పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులు ఏర్పాటుచేసిన సరస్వతీ పూజకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలుత అర్చకుల ద్వారా సరస్వతీదేవి చిత్రపటాన్ని వివిధ పూలమాలలతో విద్యార్థినీలు అలంకరించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం సామూహికంగా సరస్వతీ పూజలు నిర్వహించారు. తదుపరి మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ఇష్టపడి, కష్టపడి చదివినప్పుడే చదువులో మంచి ఉత్తీర్ణతను సాధించగలుగుతారని తెలిపారు. తదుపరి పదవ తరగతి పరీక్షలు ఎలా రాయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని వారు వివరించారు. పది తర్వాత కూడా ఏం చదవాలి అనేటువంటి విషయాలను కూడా వారు తెలియజేశారు. తదుపరి పాఠశాల హెచ్ఎం ఉమాపతి, సంబంధిత ఉపాధ్యాయులు కూడా చదువు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉమాపతితో పాటు విద్యా కమిటీ చైర్మన్ బై ముదుక రమణ, కౌన్సిలర్ కేత లోకేష్, మాజీ కౌన్సిలర్ బీరే ఎర్రి స్వామి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థినీలు పాల్గొన్నారు.