స్టేట్ రిసోర్స్ పర్సన్స్
విశాలాంధ్ర ధర్మవరం:: తరగతి గదిలో విద్యార్థుల యొక్క లోపాలను ఉపాధ్యాయులు గుర్తించగలిగితే బోధనకు తగ్గ ఫలితం వస్తుందని స్టేట్ రిసోర్స్ పర్సన్స్ శ్రీనివాసులు, విజయ్ కుమార్, డేవిడ్ బర్నర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు శ్రీ సత్య సాయి జిల్లా రాష్ట్రస్థాయి లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పాఠశాల స్థాయిలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నదో తెలుసుకొనేందుకు రాష్ట్రస్థాయి టీం పాఠశాలను సందర్శించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పలు పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యార్థులకు చదువు, బోధన విషయములో ఎన్నో జాగ్రత్తలను మెలకువలను వివరించడం జరిగింది. ఇందులో భాగంగా బత్తలపల్లి- కేజీబీవీ పాఠశాల, ధర్మవరం సంజయ్ నగర్ లోని మున్సిపల్ బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల, కొత్తచెరువులోని కేసాపురంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పుట్టపర్తి మండలం జగరాజు పల్లి మోడల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థుల యొక్క స్థాయిని వారు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా లిప్ బేస్ లైన్ తో ప్రారంభించి ప్రతినెల విద్యార్థుల ప్రగతి సాధిస్తున్నారా? లేదా? తెలుసుకొనుటకు మూల్యాంకనం చేయడం జరుగుతుందని వారు తెలిపారు.2023-24 అకాడమీ ఇయర్ మార్చి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అనంతరం లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ వలన కలుగు ప్రయోజనాలు, వాటి ప్రాధాన్యత గురించి ఉపాధ్యాయులకు పూర్తిగా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎంఈఓ- 2, గోపాల్ నాయక్, బి ఎస్ ఆర్ పాఠశాల హెడ్మాస్టర్ రాంప్రసాద్ తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.