విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమగ్ర కుల గణన డేటా సేకరణ శుక్రవారం వార్డు వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు ఇంటింటా సర్వే ప్రారంభించడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్ పర్సన్ కా చర్ల లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 40 వార్డులో సచివాలయ వాలంటీర్లు, కార్యదర్శులు ఉదయం నుండి రాత్రి వరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఇంటింటా సర్వే నిర్వహిస్తూ, అక్కడికక్కడే కుల గణనా ఆన్లైన్ యాప్ ద్వారా నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కుల గణన సర్వేకు ప్రజలు ఎటువంటి ఆధారాలు ఇవ్వవలసిన అవసరం లేదని తెలిపారు. వాలంటీర్లు, కార్యదర్శులు వచ్చినప్పుడు ఎవరైనా మిస్ అయితే వారికి తిరిగి ఐదు రోజులు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ఇంటి యజమాని వేలిముద్రలచే మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. మొత్తం పట్టణంలోని 40 వార్డులలో దాదాపు 2000 మందికి అప్పటికప్పుడే కుల గణన యాప్ లో నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం యాప్ సర్వర్ బిజీగా ఉన్నందున రాత్రి వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సర్వే నిర్వాహనపై కమీషనర్, మున్సిపల్ చైర్ పర్సన్, టిపిఆర్ఓ, మేనేజర్లు పర్యవేక్షణ గావించారు. ఈ సర్వే ఈనెల 28వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలో ఇంటి వద్దకు వచ్చే కుల గణన సర్వే అధికారులకు, సిబ్బందికి ప్రజలందరూ కూడా సరి అయిన సమాచారంతో సహకరించి ఈ సర్వేను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్ఓ సుబ్బరాయుడు, మేనేజర్ ఆనంద్ కుమార్, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.