తెలంగాణ భవన్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర చాలా గొప్పదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఎన్జీవో సంఘం కొనసాగిందని తెలిపారు. ఎప్పటికైనా ఓ నాయకుడు రాకపోతాడా అని జయశంకర్ భావించారు… బతుకమ్మ సినిమా తీద్దామని కథ కూడా రాశానని చెప్పారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ హాజరై మాట్లాడారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి ఏపీలో ముగ్గురు తెలంగాణవాళ్లే సీఎంలు అయ్యారు. తెలంగాణవాడు సీఎం కాగానే ఏదో ఒక గొడవ పెట్టి దించేసేవారు. వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు, 1999లోనే ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఉద్యమం ప్రారంభించగానే పదవులు, పైసలు కోసం మొదలుపెట్టారనే ప్రచారం చేసేవారు. ఉద్యమం కోసం ఎవరైనా పైసలు అడిగితే నాకు ఫోన్ చేయాలని చెప్పాను. ఆఫీసుకు జాగా ఇచ్చారని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం కూలగొట్టారు. ఆఫీసు కోసం తెలంగాణలోనే తెలంగాణ వ్యక్తికి జాగా దొరకని పరిస్థితి అని కేసీఆర్ ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరులను తమ ప్రభుత్వంలో ఆదుకున్నామని అదే స్ఫూర్తిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అమరుడు పోలీస్ కిష్టయ్య భార్య పద్మావతి మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు పూర్తి అయింది. మా నుంచి పోలీస్ కిష్టయ్య (భర్త) దూరమై 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆనాడు చిన్న పిల్లలను పట్టుకొని నా తండ్రిలాంటి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబానికి నేనున్నానని కేసీఆర్ మాట ఇచ్చారు. ‘నీవు బాధ పడకమ్మా… నీ పిల్లలను నేను చూసుకుంటా’ అన్నరు. వారిచ్చిన మాట ప్రకారమే… మా పిల్లలకు మా కుటుంబానికీ అన్ని విధాలా అండగా ఉన్నారు. నా బిడ్డ వైద్య విద్యకు డబ్బులు ఇస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఇప్పటి వరకు అన్ని విధాలా అసరా అందిస్తున్నారని తెలిపింది. కిష్టయ్య కొడుకు రాహుల్ మాట్లాడుతూ తాము ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశారు. మాకు ఊహ తెల్వని సమయంలోనే మా నాన్న చనిపోయారు. కేసీఆర్ మాట ఇచ్చిన ప్రకారమే మమ్ములను చూసుకుంటున్నారని పేర్కొన్నారు. చెల్లెలను మెడిసిన్ చేయించారు, ఇవాళ పీజీ కోసం మళ్లీ డబ్బులు ఇచ్చారు, మాకు అన్ని విధాలా అండగా ఉన్నారన్నారు. మమ్ములను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని, మా అమ్మకు ఒక్క తండ్రి లెక్క కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉన్నారు. మా నాన్న కల నెరవేరిందని తెలిపారు. కానీ మా మధ్య మా నాన్న లేకపోవడం బాధగా ఉంది. మా నాన్న ఉంటే ఇంకా బాగుండు అని తన మనసులో మాట చెప్పాడు.
కిష్టయ్య బిడ్డ వైద్య విద్యకు రూ.24 లక్షల చెక్కు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబానికి నేనున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు, కూతురు చిన్నపిల్లలు. వారి చదువుతో సహా కష్టకాలంలో అండగా నిలుస్తూ వస్తున్నారు. కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఎంబీబీఎస్ వైద్య విద్యకోసం ఆర్థికసాయం అందించారు. ఇప్పుడు ఆమె పీజీ చదువుతోంది. మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం రూ. 24 లక్షల చెక్కును ఆదివారం నందినగర్లో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. కిష్టయ్య కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీసి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ‘రాష్ట్రం కోసం పోరా డుతూ ప్రాణత్యాగం చేసిన మీ నాయిన చనిపోయినప్పుడు మీరు చిన్న పిల్లలు. కష్టకాలంలో అమ్మ మిమ్ములను ఎంతో కష్టపడి చదివిం చింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలోనైనా నా సహకారం ఉంటూనే ఉంటుంది’ అని కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ బాధ్యతలను గుర్తు చేశారు.