. అందరినీ కలుపుకుని పోతేనే రాష్ట్రాభివృద్ధి
. కాంగ్రెస్ ప్రభుత్వానికి నారాయణ సూచన
. సీపీఐ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది వేడుక
విశాలాంధ్ర`హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. గతంలో పాలించిన బీఆర్ఎస్ నిరంకుశంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయం మఖ్దూంభవన్లో జాతీయ పతాకాన్ని నారాయణ ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్, ఈటీ నర్సింహా, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, ఎన్.జ్యోతి, పాలమాకుల జంగయ్య, డీజీ సాయిలుగౌడ్, నాయకులు ఉజ్జని రత్నాకర్రావు తదితరులు పాల్గొన్నారు. నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ఉద్యమంలో సీపీఐ, ప్రజా సంఘాల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఒకే విధమైన తీర్మానం ఘనత కమ్యూనిస్టు పార్టీదే అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా సాగిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీతో సహా అన్ని పార్టీలు ప్రాంతాల వారీగా విడిపోయి తలో మాట మాట్లాడితే…సీపీఐ మాత్రం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకనుగుణంగా ఒకే మాట, ఒకే బాటలో ముందుకెళ్లిందని గుర్తుచేశారు. త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన 12 మందికి మంత్రి పదవులు కట్టబెట్టి స్థానికుల మనోభావాలను కించపర్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… తెలంగాణ అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలని, అన్ని వర్గాలను కలుపుకుని ప్రజాపాలన అందిస్తుందని ఆశిస్తున్నామని.. అలా కాదంటే బీఆర్ఎస్ గతే పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నారాయణ హెచ్చరించారు. గతంలో జరిగిన పాలనాపరమైన తప్పులను గుర్తించి.. తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. అందరినీ కలుపుకుని పోతేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకు కమ్యూనిస్టు పార్టీ కూడా పూర్తిగా సహకరిస్తుందని నారాయణ తెలిపారు. తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నారాయణ నివాళులర్పించారు.
ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు: కూనంనేని
త్వరలో రానున్న స్థానిక ఎన్నికలలో సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసే విధంగా సీపీఐ బలోపేతం కావాలని కూనంనేని సాంబశివరావు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంటూనే ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు సాగించాలన్నారు. ప్రజల సమస్యలపై గళమెత్తడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తద్వారా ప్రజలతో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం విరోచితంగా పోరాడిన సీపీఐ… అనుకున్న లక్షాన్ని సాధించి దశాబ్దమైందని ఆయనన్నారు.
కమ్యూనిస్టుల త్యాగాలు అనేకం: చాడ వెంకట్రెడ్డి
తెలంగాణాలో కేసీఆర్ అధ్వర్యంలో ఆత్మవంచన పాలన సాగిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆత్మగౌరవ పాలన సాగించాలని చాడ వెంకట్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిర్లక్ష్యానికి గురైనట్లు ఆవేదన వ్యక్తంచేశారు. నీళ్లు, నిధులు, నియమకాల నినాదంతో ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించారని గుర్తుచేశారు. పేదల పక్షాన నేటికీ పోరాడుతోందన్నారు. నిజాం పాలనతో అనేక ఆటుపోట్లకు గురైన తెలంగాణకు విముక్తి కమ్యూనిస్టుల త్యాగాలతోనే లభించిందని అన్నారు. ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట తెలంగాణను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసినప్పటికీ 1956 నుంచి ఈ ప్రాంత ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష క్రమంలో 1969లో తొలిదశ ఉద్యమం జరిగింది. 2009లో మలిదశ ఉద్యమం సాగింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది’ అని చాడ వెంకట్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పుస్తకాల నర్సింగ్ రావు, ఎస్.ఛాయాదేవి, కలకొండ కాంతయ్య (వ్యవసాయ కార్మిక సంఘం), పల్లె నర్సింహ్మా, లక్ష్మీనారాయణ (ప్రజానాట్యమండలి), బి.వెంకటేశం (ఏఐటీయూ), కె.ధర్మేంద్ర (ఏఐవైఎఫ్), పుట్ట లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్) పాల్గొన్నారు.