వేములవాడ ఆలయ, పట్టణాభివృద్ధి పనులపై మంత్రులు, వీటీడీఏ, దేవాదాయ శాఖ అధికారులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు సమాంతరంగా పట్టణాభివృద్ధి జరగాలని, దానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలను రూపొందించుకుని అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. బద్ధిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని, దానికి సంబంధించిన స్థల సేకరణను వెంటనే చేపట్టాలన్నారు. వేములవాడలో దశల వారీగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టాలని, బ్రిడ్జి నుంచి గుడి వరకు రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, వీటీడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, వేములవాడ ఈవో క్రృష్ణ ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవీ రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.