భారత స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సోమవారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, 15న జరిగే భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ వేడుకలకు పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ను నియంత్రించాలన్నారు. ఆరోగ్యశాఖ తరపున ఉత్సవాలకు తరలి వచ్చే వారికి మాస్క్లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో స్సెషల్ చీఫ్సెక్రటరీ సునీల్శర్మ, అడిషనల్ డిజి జితేందర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, విద్యుత్శాఖ సందీప్ కుమార్ సుల్తానియా, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.