తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని అన్నారు. అలాగే, గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే.. రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారని విమర్శించారు. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాల మీద ఎలా సంతకం చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు.75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీచేసిన కోదండరాంను ఏరకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్భవన్ నడుస్తున్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యులు కాదని రాష్ట్ర ప్రజలకు బాధ్యులనే విషయం గుర్తుంచుకోవాలని హితవుపలికారు. నాడు కనిపించిన రాజకీయ నేపథ్యానికి ఉన్న అభ్యంతరాలు నేడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా అనే విషయం చెప్పాలన్నారు. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును తెలియజేస్తుందని చెప్పారు.