మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు, వివిధ పార్టీల నేతలు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని నెక్లెస్రోడ్డులో ఉన్న పీవీ జ్ఞానభూమి వద్ద అంజలి ఘటించారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవితో పాటు ఇతర కుటుంబసభ్యులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నివాళులర్పించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని, సత్యవతి రాథోడ్, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు పీవీకి నివాళులర్పించారు. దేశానికి, తెలంగాణకు పీవీ నరసింహారావు అందించిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తుచేసుకున్నారు.క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడారని తెలిపారు. పీవీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ అన్నారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పీవీ నరసింహారావు మారుమూల గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆయన వస్త్రధారణ ఉండేదని చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని.. ఈ విషయంలో భారాస పోరాడుతుందని చెప్పారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసన మండలిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొన్నారు.