మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. రామోజీరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రామోజీరావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా సంతాపం తెలియజేశారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఆయన మరణ వార్త తీవ్ర విషాదానికి గురి చేసిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.