సీఎం రేవంత్రెడ్డితో హెచ్సీసీబీ చర్చలు
విశాలాంధ్ర – హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు హిందుస్థాన్ కోకో కోలా బెవెరేజెస్ కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం సెక్రెటేరియట్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ కంపెనీ దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యమవుతుందని కంపెనీ ప్రతినిధి బృందం సీఎంతో చర్చలు జరిపింది. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. హిందుస్థాన్ కోకో కోలా బెవెరేజెస్ (హెచ్సీసీబీ) పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమాన్షు ప్రియదర్శని, కంపెనీ ప్రతినిధులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
బిల్ట్ మిల్లు పునరుద్ధరించాలి
ములుగు జిల్లా కమలాపురంలో బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ పునరుద్ధరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారీ చేస్తారు. 2014లోనే ఈ మిల్లు మూతపడిరది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ చూపారు. నేషనల్కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధీనంలో ఉన్నాయి. ఆ కంపెనీ ఎండీ హార్దిక్ పటేల్, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈవో వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సెక్రెటేరియట్లో సోమవారం సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు. మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్క్వెస్ట్ బృందాన్ని కోరారు.
బిల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీ తో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.
సీఎంతో పాటు మంత్రులు అనసూయ, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.