కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శ
విశాలాంధ్ర-హైదరాబాద్ : ఎన్నికల సమయంలో క్వింటాల్ వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు సన్న వడ్లకి మాత్రమే ఇస్తామంటూ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని, సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తప్పకుండా మీరు తీర్పును ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారెంటీలు… ఈ విధంగా 420 హామీలు ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు ఆరు గ్యారెంటీల్లో 5 అమలు చేశామని… మిగతావేవీ అవసరం లేదన్నట్టుగా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్లకు ఓటేద్దామా? పదేళ్ల పాటు నిజాయితీ గా పనిచేసిన కేసీఆర్ అభ్యర్థికి ఓటు వేద్దామా అని ప్రశ్నించారు. గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత మరొక మాట మాట్లాడే ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడిరచాలన్నారు.