చింతపల్లి సబ్ డివిజనల్ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – ఈనెల 6న చింతపల్లి యువ శిక్షణ కేంద్రంలో నిర్వహించే ప్రేరణ జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి అని చింతపల్లి ఏ ఎస్ పి ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. స్థానిక సబ్ డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ప్రశాంతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సహకారంతో స్థానిక యువ శిక్షణ కేంద్రంలో ఈనెల 6న ఉదయం 9 గంటల నుండి మూడు గంటల వరకు నిరుద్యోగ యువతులకు టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. గత ఏడాది 72 మంది యువతులకు ఈ విధంగానే అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. స్థానిక యువ శిక్షణ కేంద్రంలో నిర్వహించే ప్రేరణ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన యువతులు మాత్రమే అర్హులన్నారు. అర్హులైన వారు నేరుగా హాజరై దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన యువతులకు బెంగళూరులో వివిధ కోర్సులలో శిక్షణ ఇప్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబడునన్నారు. ఈ శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించబడునని, ఉద్యోగంలో చేరిన యువతులకు సుమారు రూ.20 వేల జీతం తో పాటు ఉద్యోగ భద్రత కల్పించబడునన్నారు. ఈ ఉద్యోగాలకు అల్లూరి జిల్లాకు సంబంధించిన యువతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్, ఎస్సై అరుణ్ కిరణ్ పాల్గొన్నారు.