పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అసౌకర్యం లేకుండా చర్యలు
ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం : జిల్లా విద్యాశాఖ అధికారి వెల్లడి
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : జిల్లాలో పదో తరగతి పరీక్షల సజావుగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్కుమార్ వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. మార్చి 18వ తేదీ నుంచి జిల్లాలోని 129 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని ఇందులో మొత్తం 27,178 మంది విద్యార్దులు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 23,828 మంది విద్యార్ధులు రెగ్యులర్ విద్యార్ధులు కాగా 3350 మంది ప్రైవేటు విద్యార్ధులు వున్నట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామని, తగిన ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, ప్రాథమిక చికిత్స తదితర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష ప్రారంభమైన సమయం నుంచి అరగంట వరకు అంటే ఉదయం 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి విద్యార్ధులను అనుమతిస్తారని చెప్పారు. పది గంటల తర్వాత అభ్యర్ధులెవరినీ లోనికి అనుమతించరని స్పష్టంచేశారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, హాల్టిక్కెట్ చూపినట్లయితే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారని చెప్పారు. జిల్లాలో పదోతరగతి పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్కుమార్ బుధవారం తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ పొందిన అభ్యర్ధులంతా తమ పేరు, పుట్టినతేదీ, ఫోటో, సబ్జెక్టులు మొదలైన అన్ని వివరాలను నిశితంగా ధృవీకరించాలని, ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే పాఠశాల ప్రదానోపాధ్యాయుడిని లేదా ప్రిన్సిపాల్ను సంప్రదించాలన్నారు. అభ్యర్దులు పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా హాల్టిక్కెట్ తీసుకువెళ్లాల్సి ఉంటుందని, హాల్టిక్కెట్ తీసుకెళ్లడంలో విఫలమైతే పరీక్షలు రాసేందుకు అనుమతించరని చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించనున్నట్టు చెప్పారు. పరీక్ష పూర్తయ్యే వరకు విద్యార్ధులను బయటకు వెళ్లేందుకు అనుమతించరని చెప్పారు. ప్రశ్నపత్రాలు బయటకు పంపే వీలులేకుండా అన్ని ప్రశ్నపత్రాలకు క్యు.ఆర్. కోడ్ ఏర్పాటు చేశామని ఎక్కడి నుంచి బయటకు వెళ్లింది సులువుగా తెలుసుకోగలమన్నారు. విద్యార్ధులు తమ వెంట పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్ను, పెన్సిల్ వంటి స్టేషనరీ సామాగ్రి తెచ్చేందుకు అనుమతి ఇస్తామన్నారు.
పదో తరగతి పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని తెలిపే నిమిత్తం తమ కార్యాలయంలో 9000945346 మొబైల్ నెంబరుతో ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేశామని, కార్యాలయ వేళల్లో ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.