జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్
విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని దేశంకోసం, ప్రజల కోసం పనిచేయాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ పిలుపు నిచ్చారు. మంగళవారంనాడు జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో అల్లూరి సీతారామరాజు 125వజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో సిబ్బందిని, జిల్లా ప్రజలనుద్దేశించి జిల్లా కలెక్టరు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతిని ప్రభుత్వం రాష్ట్రఉత్సవంగా ప్రకటించిందన్నారు. 1897సంవత్సరం జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించిన అల్లూరి సీతారామరాజు కుటుంబ పరిస్థితులరీత్యా వివిధపట్టణాలలో విద్యాబ్యాసం చేసారన్నారు. దేశయాత్రలోభాగంగా దేశంలోని వివిధ ప్రదేశాలను సందర్శించిన ఆయన మన్యంలోఅమాయకులైన గిరిజనులపై బ్రిటీషుఅధికారులు సాగిస్తున్న దురాగతాలను, దమనకాండనుచూసి చలించిపోయారని తెలిపారు.గిరిజనులలో ధైర్యాన్ని నింపి బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడటానికి దళాన్ని తయారుచేసి, తక్కువ వనరులతో ఎంతో బలమైన బ్రిటీషు సైన్యాన్ని ఎదిరించిన ధీశాలి అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. అసంబద్దమైన బ్రిటీషు చట్టాలకు వ్యతిరేకంగా, అమాయకులైన గిరిజనుల హక్కుల కోసం పోరాటం జరిపిన, గిరిజనుల జీవితాలలో మార్పుకోసం పాటుపడిన అల్లూరి సీతారామరాజును స్పూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవచేయాలని కలెక్టరు తెలిపారు. గిరిజనులు ఎక్కువగా గల మన జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు, వారి జీవితాలలో మార్పులు తీసురావడానికి పాటుపడాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, కలెక్టరు కార్యాలయ సూపరింటెండెంటులు శ్రీరామ్మూర్తి, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.