విశాలాంధ్ర విజయనగరం టౌన్ సామాజిక సమానత్వం కోసం బాబూ జగజ్జీవన్ రాం అందించిన సేవలు అజరామరమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు అన్నారు. శుక్రవారం జగజ్జీవన్ రాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగజ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మల్లయ్య నాయుడు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పాటుపడుతూనే అణగారిన వర్గాలను అభ్యున్నతి వైపు తీసుకెళ్లాలన్నా దృఢచిత్తంతో అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. 40 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళను అధిగమించార న్నారు. ఉప ప్రధానిగా, అనేక కేంద్రమంత్రి పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నెతెచ్చిన మహోన్నత వ్యక్తని కొనియాడారు. బాబూ జగజ్జీవన్ రాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, వివిధ విభాగాల అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.