విశాలాంధ్ర,సీతానగరం:మండలకేంద్రంలో బుధవారం జరగాల్సిన టిడిపి, వైఎస్సార్సీపీ బహిరంగ సభలకు అనుమతులను పార్వతీపురం రిటర్నింగ్ అధికారి మంజూరు చేయలేదు కనుక సభలను, ర్యాలీలు నిర్వహించవద్దని పార్వతీపురం సిఐ కె.రవికుమార్ ఎన్నికల ప్రవర్తన నియమావళి మండల అధికారి ఈశ్వరరావు, ఎస్సై రాజేష్ లు తెలిపారు బుధవారం నాడు వారు సీతానగరం మండల కేంద్రంలో నిర్వహించనున్న టిడిపి, వైఎస్సార్సీపీ సభల వద్దకు వెళ్లి నాయకులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి గూర్చి వివరించారు.అనుమతులు లేనందున సభను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఎప్పుడైనా సభను,ప్రచారం, ర్యాలీ నిర్వహించాలంటే 48 గంటల ముందు రిటర్నింగ్ అధికారికి నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి దరఖాస్తులు చేయాలని, ఆర్ ఓ అనుమతులను కలిస్తే సభలు, సమావేశాలు,ప్రచారం, ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. పార్టీల అభ్యర్థులు ప్రచారానికి అనుమతులను ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు తప్పనిసరిగా తీసుకోవాలని, పార్టీల నాయకులు దీన్ని గమనించాలని పిలుపునిచ్చారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే అన్నిగ్రామాల్లో ఎన్నికల నియమాలుగూర్చి అందరికీ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల గూర్చి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి గూర్చి ప్రతీ ఒక్కరు గమనించాలన్నారు. 24గంటలపాటు వివిధరకాల టీంలు పర్యవేక్షణ, నిఘాచేస్తుంటాయని, దీంతో పాటు ఇప్పటికే ఫ్లయింగ్ స్పాట్ అనునిత్యం తిరుగుతూ పర్యవేక్షణ చేస్తుందన్నారు. మండలంలో జరుగుతున్న సంఘటనలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమీషన్ నియమించిన ఫోటో గ్రాపర్లు వీడియో ద్వారా కూడా చిత్రీకరణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని సచివాలయసిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీసిబ్బంది, బిఎల్వోలు, వి ఆర్ ఎ లు అప్రమత్తంగా ఉండి ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహిస్తూ గ్రామాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలకు తగుచర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా టీడిపి మీటింగు ప్రైవేటు కార్యక్రమంగాఒకఇంటిముందు జరగడంతోపాటు వైఎస్సార్సీపీ సమావేశం జరగకపోవడంతో పోలీసులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయంనుంచి మధ్యాహ్నంవరకు పోలీస్ సిబ్బంది, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు అక్కడేఉండి పరిశీలన చేయడం గమనార్హం.