జిల్లా ఎస్పీ ఎం. దీపిక, ఐపిఎస్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తదుపరి జూన్ 4న ఎన్నికల కౌంటింగు చేపట్టే జె.ఎన్.టి.యు, లెండి ఇంజనీరింగు కళాశాలల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. మూడంచెల భద్రతలో భాగంగా స్ట్రాంగు రూమ్స్, కౌంటింగు కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు భద్రత విధులు నిర్వహిస్తాయన్నారు. తదుపరి ఆర్మ్ డ్ రిజర్వు, ఎపిఎస్సీ బలగాలు స్ట్రాంగు రూమ్స్, కౌంటింగు నిర్వహించే భవనాలు చుట్టూ భద్రత విధులు నిర్వహిస్తారని, తదుపరి సివిల్ పోలీసులు భద్రత విధులు నిర్వహిస్తున్నారన్నారు. వీరు కాకుండా ఇంజనీరింగు కళాశాల భవనాలకు 2 కి.మీ.ల పరిధిలో కట్ ఆఫ్ పార్టీలు పహారా కాస్తుంటాయన్నారు. ఈ ప్రాంతాల్లోకి కౌంటింగు విధులు నిర్వహించే ఉద్యోగులు, ఆథరైజేషను లెటర్స్ ఉన్న ఏజంట్లు, మీడియా వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. కౌటింగు నిర్వహించే రోజున జిల్లా వ్యాప్తంగా 144 సిఆర్పిసి అమలులో ఉన్నందున, ఎక్కడా కూడా గుంపులుగా మనుష్యులు ఉండకూడదన్నారు. అంతేకాకుండా, విజయోత్సవ ర్యాలీలు, మందుగుండు వినియోగానికి ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేసారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు, మందుగుండు సామగ్రిని వినియోగిస్తే, వారిపై ఐపిసి కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జూన్ 6 వరకు అమలులో ఉన్నందున, కౌంటింగు రోజున ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగు పూర్తయి, ఫలితాలు వెల్లడైన తరువాత అల్లర్లు జరిగేందుకు అవకాశం ఉన్న 100 గ్రామాలను ముందుగా గుర్తించి, ఆయా గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ముందుగా పికెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, సమస్య ఎక్కడ ఉత్పన్నమైనా, వెంటనే స్పందించేందుకు ప్రత్యేకంగా క్విక్ రియాక్షన్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసామన్నారు. ఈ బృందాలు సిఐలు లేదా ఎస్ఐల ఆధ్వర్యంలో పని చేస్తాయని, వీటితోపాటు ఈ గ్రామాలన్నింటిని కవర్ చేస్తూ ప్రత్యేకంగా పెట్రోలింగు బృందాలను కూడా ఏర్పాటు చేసామని తెలిపారు. కౌంటింగు కేంద్రాల్లోకి వెళ్ళే ఏజంట్లు తమ వెంట మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్టు వాచ్లు, క్యాలిక్యులేటర్లు, భోజనాలు, వాటర్ బాటిళ్ళును అనుమతించమన్నారు. కావున, ఎవ్వరూ కూడా తమ వెంట ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేసారు. ఏజంట్లు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య అధికారులు, ముఖ్యమైన వ్యక్తుల వాహనాలను పార్కింగు చేసేందుకు వేరు వేరుగా పార్కింగు ఏర్పాట్లు చేసామన్నారు. ఎన్నికల కౌంటింగు ప్రక్రియ ప్రశాంతయుతంగా ముగిసేందుకు పోలీసుశాఖ చేపట్టిన భద్రత చర్యలకు ప్రజలు, నాయకులు సహకరించాలని కోరారు. కౌంటింగు కేంద్రాల వద్ద రెడ్ జోన్ లను ఏర్పాటు చేసామని, రెడ్ జోన్ పరిధిలో ఎవ్వరూ కూడా డ్రోన్లును వినియోగించడాన్ని నిషేధించామన్నారు. కౌంటింగు ప్రక్రియకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టామని, ఎవ్వరైనా ఉద్ధేశ్య పూర్వకంగా కౌంటింగు నిలిపేందుకు ప్రయత్నిస్తే, రిటర్నింగు అధికారి ఆదేశాలతో వారిని కౌంటింగు కేంద్రాల బయటకు పంపేయడంతోపాటు, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం. దీపిక హెచ్చరించారు. కౌంటింగు ప్రక్రియ చేపట్టే జూన్ 4న విశాఖపట్నం – విజయనగరం, విజయనగరం – విశాఖపట్నం, గజపతినగరం -విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాల ట్రాఫిక్ మళ్లించనున్నట్లుగా తెలిపారు. ట్రాఫిక్ మళ్ళింపులను ప్రజలందరూ గమనించాలని, పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.
ఎన్నికల కౌంటింగు ప్రక్రియ నిర్వహించే రోజున చేపట్టే ట్రాఫిక్ మళ్ళింపులు
విశాఖపట్నం నుండి విజయనగరం వైపు వచ్చే వాహనదారులకు సూచనలు
విశాఖపట్నం నుండి విజయనగరం వైపు వచ్చే వాహనాల మహరాజుపేట మీదుగా నాతవలస జాతీయ రహదారి వైపు మళ్ళిస్తామన్నారు.
మోదవలస జంక్షన్ వరకు వచ్చిన వాహనదారులను మోదవలస జంక్షన్ వద్ద గల శిల్ప మెడికేర్ మీదుగా నాతవలస వైపు జాతీయ రహదారి వైపుకు మళ్ళిస్తామన్నారు.
విజయనగరం నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనదారులకు సూచనలుః*
విటి అగ్రహారం వై-జంక్షన్ వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసి, విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలను రామనారాయణం మీదుగా కొత్తవలస లేదా పద్మనాభం వైపు మళ్ళిస్తామన్నారు.
అయినాడ జంక్షన్ వరకు వచ్చే వాహనాలను చింతలవలస, గంట్లాం మీదుగా అక్కివరం జాతీయ రహదారి వైపు మళ్ళిస్తామన్నారు.
జొన్నాడ వరకు వచ్చే వాహనదారులను చింతలవలస, గంట్లాం మీదుగా అక్కివరం జంక్షన్ జాతీయ రహదారి వైపు మళ్ళిస్తామన్నారు.
గజపతినగరం నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనదారులకు సూచనలుః*
గజపతినగరం వైపు నుండి వచ్చే వాహనాలను గొట్లాం బైపాస్ రోడ్డు మీదుగా కోరాడపేట బ్రిడ్జి క్రింద నుండి చిన్నాపురం లేదా కొత్తలవలస వైపు మళ్ళిస్తామన్నారు.
కావున, కౌంటింగు రోజున ప్రజలందరూ ఈ ట్రాఫిక్ మళ్లింపులను గమనించి, పోలీసుశాఖకు సహకరించాలనిజిల్లా ఎస్పీ ఎం.దీపిక కోరారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి అస్మా ఫర్హీన్ గారు,స్పెషల్ బ్రాంచ్ సిఐ కే.కే. వి. విజయనాధ్, వన్ టౌన్ సిఐ బి. వెంకటరావు పాల్గొన్నారు.