టిడిపి రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు…
విశాలాంధ్ర- ఏలూరు: వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ విమర్శించారు. బుధవారం స్థానిక బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంజనేయులు, బాలాజీ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. తాను దళిత పక్షపాతి అని నిత్యం చెప్పుకునే జగన్ అధికారం చేపట్టిన తర్వాత దళితులపైనే దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళలపై హత్య, అత్యాచారాలు చేస్తూ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చించినాడ లో అనాదిగా దళితుల సాగు చేస్తున్న భూములను వైసీపీ కబ్జాదారులు ఆక్రమించి దళితులకు ఉపాధి లేకుండా చేశారని ఇదేమని ప్రశ్నించిన నాయకులపై పోలీసులు రాక్షసంగా వ్యవహరించారని విమర్శించారు. మంగళవారం రాత్రి దళిత మహిళ యడ్ల ఫ్రాన్సిక పై కొందరు దుండగులు యాసిడ్ దాడి చేస్తే పోలీసు అధికారులు పరామర్శించారు తప్ప నిందితులపై చర్యలు తీసుకోలేదన్నారు. యాసిడ్ దాడికి గురైన యడ్ల ఫ్రాన్సిక కుటుంబానికి న్యాయం చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని పక్షంలో రానున్న రోజులలో వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పటానికి రాష్ట్రంలో ఉన్న దళిత సమాజం ఐక్య పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో నగర ఎస్ సి సెల్ ప్రధాన కార్యదర్శి చౌటపల్లి శ్రీను, టిడిపి 44,18, 38,డివిజన్ ఇంచార్జ్ లు లక్క పోగు రవీంద్ర, పలివెల కిషోర్, గరికపూడి చంటి, దళిత నాయకులు బొడ్డు వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.