. మణిపూర్ హింసపై మోదీ స్పందించాలి
. సీపీఐ ఎంపీ సంతోశ్కుమార్
. ఉత్సాహభరితంగా ఏఐవైఎఫ్ సమ్మేళనం ప్రారంభం
విశాలాంధ్ర – విజయవాడ: దేశంలో రాజ్యాంగ వ్యతిరేక, మతోన్మాద, విచ్ఛిన్నకర శక్తుల ఆటకట్టించేందుకు యువత సంసిద్ధులు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్రస్థాయి యువజన, విద్య, వైజ్ఞానిక సాంస్కృతిక సమ్మేళనం ఉత్సాహభరిత వాతారణంలో మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు మార్కెట్ సెంటర్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ సభ్యుడు పి.సంతోశ్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. శాస్త్రీయ సోషలిజం కోసం ఏఐవైఎఫ్ పనిచేస్తోందని సంతోశ్కుమార్ చెప్పారు. కొత్త ఆలోచనలు, నినాదాలతో యువతను ముందుకు నడిపిస్తున్నదన్నారు. యువతకు రాజకీయ శిక్షణా తరగతులు ఎంతో అవసరమన్నారు. సమాజం పట్ల అవగాహన లేకుండా పనిచేయటం కష్టమని వ్యాఖ్యానించారు. రాజకీయాలు వ్యాపారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం వైసీపీదని విమర్శించారు. ధనం సేకరించటం, ఖర్చు చేయటం తెలుసుకుంటే సంతృప్తి ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఎందుకు ఖర్చు చేస్తున్నారో యువత ఆలోచన చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే వామపక్ష పార్టీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎందుకు ఉండటం లేదో పరిశోధించాలని కోరారు. చరిత్ర తెలుసుకుని పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజల కనీస అవసరాలు తీర్చాలని, తాగునీరు, స్వచ్ఛమైన గాలితో ప్రశాంతంగా జీవించే అవకాశం కలిగించాలన్నారు. స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వాళ్లు కానుకగా ఇవ్వలేదని, ఎందరో ప్రాణాలు త్యాగం చేయటం వల్ల లభించిందన్నారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లు దురదృష్టవశాత్తు పాలకులయ్యారని విమర్శించారు. రాజ్యాంగం రాసే సందర్భంలో ప్రతి ఆర్టికల్ను ఎంతో సునిశితంగా విశ్లేషించి పొందుపరిచారని చెప్పారు. దేశానికి హిందుస్థాన్గా కాకుండా ఇండియాగా నామకరణం చేశారన్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్ గాడ్సేను దేవుడుగా అభివర్ణించటాన్ని తప్పుబట్టారు. మణిపూర్లో విధ్వంసం జరుగుతుంటే మోదీ యోగా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టెర్రరిస్టు ఘటనపై మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న పాలకులను గద్దె దించాలంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై మాట్లాడుతూ కార్పొరేట్, మతోన్మాదశక్తులు అధికారంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, డిజిటలీకరణ వంటి అంశాలతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. మన హక్కుల కోసం, ప్రజల భవిష్యత్ కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మన నుంచి ఏమి ఆశిస్తున్నారో వాటిని సాధించటం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చాలా రైళ్లు రద్దైయినప్పటికీ రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన యువతను ఆయన అభినందించారు. ఏఐవైఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్లో పనిచేస్తున్న యువతలో ప్రతిభకు కొదవ లేదన్నారు. కొంచెం ప్రోత్సాహం ఉంటే ఉన్నత శిఖరాలు చేరుకుంటారని చెప్పారు. సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ విద్యారంగంలో దోపీడీకి వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ పోరాటం చేస్తున్నదన్నారు. మాదక ద్రవ్యాలతో యువత రకరకాల ప్రలోభాలకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థను మార్చటం కోసం యువత ముందుకు వస్తున్నదని, వారికి కర్తవ్య బోధన చేసి రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. మిమిక్రి రమేశ్ మాట్లాడుతూ యువతను ఫోన్లు, సినిమాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు. రాకేశ్ మాస్టర్ మానసిక వేదన మనకు హాస్యంగా మారిందన్నారు. ఈ సందర్భంగా సినీ సంగీతం, అభ్యుదయ గీతాలు, డీజే సౌండ్సిస్టం గురించి ధ్వని అనుకరణ చేస్తూ యువతను ఊర్రూతలూగించారు. సభకు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్బాబు అతిథులను ఆహ్వానించారు. తొలుత జి.ఈశ్వరయ్య ఏఐవైఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య బృందం అభ్యుదయ గీతాలు ఆలపించి సభికుల్ని ఉత్సాహపరిచింది. ఏఐవైఎఫ్ కార్యవర్గ సభ్యులు, జనసేవా దళ్ సభ్యులు క్రమశిక్షణతో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గుంటూరు నగరం ఏఐవైఎఫ్ జెండాలతో కొత్త కళను సంతరించుకున్నది. ప్రధాన కూడళ్లను ఏఐవైఎఫ్ తోరణాలతో అలంకరించారు. మహనీయుల చిత్రపటాలు, వారు నిర్ధేశించిన అంశాలతో కూడిన ప్లకార్డులు యువతను ఆలోచింపచేశాయి.