. స్వార్థప్రయోజనాల కోసమే ఆ నివేదికని ఆరోపణ
. ఎలాంటి అవకతవకలు జరగలేదని బుకాయింపు
న్యూదిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్పై గౌతమ్ ఆదానీ మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ గ్రూప్ అవకతవకలపై ఐదు నెలల క్రితం హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక సంస్థను అప్రతిష్ఠ పాల్జేసేందుకు తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు. అప్పట్లో ఈ నివేదిక ప్రకంపనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై ప్రధాని ప్రకటన చేయాలని పార్లమెంట్ ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింపచేశాయి. మోసపూరిత లావాదేవీలు, స్టాక్ ధరల తారుమారు వంటి అవకతవకలకు అదానీ గ్రూప్ సంస్థలు పాల్పడ్డాయని ఆ నివేదికలో హిండెన్బర్గ్ పేర్కొంది. ఆ నివేదిక దేశవ్యాప్తంగా వాణిజ్యంగా, రాజకీయంగా దుమారం రేపింది. ఫలితంగా అదానీ స్టాక్లు కుప్పకూలాయి. ఆర్థికంగా సంస్థ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అనేక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో హిండెన్బర్గ్ నివేదికపై గౌతమ్ అదానీ తాజాగా స్పందించారు. తమ సంస్థలకు ఢోకా లేదని, అవాస్తవాలను ప్రచారం చేసి తమ సంస్థల ప్రతిష్ఠను మంటగలపాలనే తప్పుడు ఉద్దేశంతో హిండెన్బర్గ్ నివేదిక వెలువడిరదని గౌతం అదానీ వ్యాఖ్యానించారు. పోర్టుల నుంచి ఇంధన సంస్థల వరకు అన్ని సజావుగా సాగుతాయని నమ్మకాన్ని కనబర్చారు. షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ ఐదు నెలల కిందట వెలువరించిన నివేదికలో చేసినవి తప్పుడు ఆరోపణలు అని చెప్పారు. అదానీ గ్రూప్ కంపెనీలు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని సుప్రీంకోర్టు నియమిత నిపుణుల కమిటీ తేల్చిందని, అది మదుపరుల్లో విశ్వాసం నింపడానికి దోహదమైందని అన్నారు. కంపెనీ వెల్లడిరచిన వివరాల్లోగానీ, నియంత్రణలోగానీ లోపాలు లేవని నిపుణుల కమిటీ నివేదికతో వెల్లడైందని తెలిపారు. అయితే మరో నెలలో సెబీ నివేదిక రాబోతోందని, దానిపైనా పూర్తి విశ్వాసంతో ఉన్నామని గౌతం అదానీ చెప్పారు. అదానీ గ్రూప్లో భారీగా పెట్టుబడులు పెట్టిన అమెరికాకు చెందిన సంస్థాగత మదుపుదార్ల నుంచి ఆ దేశ నియంత్రణ సంస్థలు సమాచారాన్ని కోరాయన్న వార్తలతో గతవారం అదానీ గ్రూప్ స్టాక్స్ పడిపోయాయి.