కుల, ఆదాయ పత్రాలకు అఫిడవిట్ మెలిక
. సచివాలయ సిబ్బంది నిబంధనలు
. రుసుము లేదని ప్రభుత్వం గొప్పలు బ అర్జీదారుల ఆందోళన
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం జులై 1 నుంచి ప్రవేశపెడుతున్న జగనన్న సురక్ష క్రార్యక్రమానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. సర్వీసు చార్జీలు లేకుండా ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా జారీ జేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఆ దిశగా సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో దీని అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. జగనన్న సురక్ష ద్వారా 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ప్రజలకు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా సంక్షేమ పథకాలకు ఎవరైనా దూరమై ఉండి… వివిధ సాంకేతిక కారణాల రీత్యా ధ్రువీకరణ పత్రాలు పొందలేక పోతే…వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 11 రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని భావించింది. ఈ కార్యక్రమం ద్వారా కుల ధ్రువీకరణ, ఆదాయ, వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వాటితోపాటు ఆధార్కు ఫోన్ నంబరు అనుసంధానం, మ్యుటేషన్ లావాదేవీ, కుటుంబ సభ్యుడి ధ్రువీకరణ పత్రం, పంట సాగు హక్కు కార్డు (సీసీఆర్సీ), కొత్త/స్పిలిట్ రైస్ కార్డు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విభజన తదితర పత్రాలు జగనన్న సురక్షతో అందజేస్తారు. ఇందులో అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో నెల రోజులపాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఈ ధృవీకరణ పత్రాలు కోరే వారంతా, ఆయా సచివాలయాల పరిధిలోని సంబంధిత వలంటీర్ల ద్వారా ముందస్తుగా వివరాలు అందజేయాలి. అలా వివరాలిచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి, ఒక సర్వీసు నంబరు కేటాయిస్తారు. 1వ తేదీ నుంచి ఆయా సచివాలయాల పరిధిలో జరిగే క్యాంపుల ద్వారా ధ్రువీకరణ పత్రాలిస్తారు. ఇందులో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కోరుతున్న వారికి చుక్కెదురవుతోంది. వారంతా బయట నుంచి అఫిడవిట్ చేయించుకుని దరఖాస్తులు అందజేయాలని వలంటీర్లు స్పష్టం చేస్తున్నారు. కుల, ఆదాయ పత్రాలు పొందే వారికి ఒక్కో దానికి అఫిడవిట్ చేసేందుకుగాను రూ.300 వరకు ఖర్చవుతోంది. అటు ప్రభుత్వమేమో ఎలాంటి రుసుం లేకుండా ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. ఇటు సచివాలయ సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరించడంపై ప్రజలలో గందరగోళం నెలకొంది.
వేసవి సెలవులు అనంతరం విద్యా సంస్థల్ని పున:ప్రారంభించడంతో ప్రతి విద్యార్థికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల అవసరత ఉంది. దీంతో అధికంగా ఈ రెండు పత్రాల కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటికి అఫిడవిట్ చేసి ఇవ్వాలనే నిబంధనతో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు.
పాతవి ఉన్నా అఫిడవిట్ ఇవ్వాల్సిందే
గతంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను చాలామంది తీసుకున్నారు. విద్యాసంస్థల నిబంధనల మేరకు తాజాగా ధ్రువీకరణ పత్రాలు కోరడంతో మళ్లీ విద్యార్థులు వాటి కోసం దరఖాస్తు చేయాల్సిన దుస్థితి
ఎదురవుతోంది. దీంతో దరఖాస్తుతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఇస్తే, వారికి తాజాగా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. వాటికి విరుద్ధంగా అఫిడవిట్ ఉంటేనే దరఖాస్తులను వలంటీర్లు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు
అఫిడవిట్ విధానాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది.
26 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులు
జగనన్న సురక్ష కోసం 26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు సైతం క్యాంపుల్లో ఉంటారు. అక్కడ సేవలందుతున్న తీరుపై ఆరా తీస్తారు. అధికారులతోపాటు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నారు. ఇంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న సురక్షలో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలకు అఫిడవిట్లు అడగడంతో దరఖాస్తుదారులకు జాప్యం జరుగుతోంది. కొత్త రైస్ కార్డుల జారీ, చేర్పులు, మార్పుల సమయంలోనూ వివిధ సాకులు చూపుతున్నట్లు సమాచారం. ఫ్యామిలీ, జనన, మరణాల ధ్రువీకరణ పత్రాల జారీలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. జనన ధ్రువీకరణ పత్రాల కోసం సంబంధిత మున్సిపల్ కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నిబంధన విధిస్తున్నారు. ఇలా ప్రతిదానికి ఏదో ఒకసాకు చూపడంతో అర్జీదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం ఇన్ని నిబంధనలు పెట్టడంపై మండిపడుతున్నారు. అలాంటప్పుడు జగనన్న సురక్ష ఇంకెందుకని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ స్పందించి జగనన్న సురక్షలో భాగంగా ఎలాంటి రుసుముల భారం పడకుండా, ఇబ్బందికర నిబంధనలు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.