కిలో రూ.60పైనే
కొనలేక సామాన్యుడి సతమతం
న్యూదిల్లీ: సామాన్య,మధ్యతరగతి జనంపై భారం రోజురోజుకు పెరుగుతోంది. పొద్దున లేచినప్పటినుంచి పూట గడవటమెలాగా అని బెంగపట్టుకుంటోంది. పెరుగుతున్న నిత్యావసరాలకు తోడుగా బియ్యం, కూరగాయల ధరలు జనం జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కొద్దిరోజుల వరకు టమాటా కిలో రూ. 15 కూడా దాటనిది… ఇప్పుడు వంద దాటేసింది. పచ్చిమిర్చి కూడా కిలో రూ. వందపైనే ఉన్నది. అల్లం కిలో రూ. 250పైనే ఉన్నది. దానితో సరుకులు, కూరలు ఆచితూచి కొనాల్సివస్తోందని వినియోగదారులు అంటున్నారు. ఇక అనేక ప్రాంతాలలో రుతుపవనాల కారణంగా జోరుగా వానలు పడుతుండడంతో కూరగాయల రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగి ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. జిహ్వచాపల్యాన్ని చంపుకోలేక కొన్నామా జేబులు ఖాళీ అవడం ఖాయం.
కూరగాయల ధరలతోనే సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మరో పిడుగు పడిరది. క్వింటా బియ్యం ఏకంగా రూ. 6 వేలకు చేరింది. సోనామసూరి, ఆర్ఎన్ఎల్, స్టీం రైస్, ఐఆర్-64 రకాల బియ్యం ధరలు చుక్కలు తాకడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. 6 మాసాలు, ఏడాది, 18 నెలలు ఇలా పాతపడిన బియ్యానికి మిల్లర్లు, వ్యాపారులు వివిధ ధరలు నిర్ణయించారు. 6 మాసాల సోనామసూరి కిలో ఏకంగా రూ. 59, అదే ఆర్ఎన్ఎల్ కిలో రూ. 60 వరకూ ధర ఉన్నట్లు బోర్డులు వేశారు. ప్రతి నెలా లేదా రెండు మూడు నెలలకు ఒకసారి బియ్యం కొని తినే మధ్య తరగతి ఉద్యోగులు, ప్రజలకు పెరిగిన ధరలు తీవ్ర భారంగా మారాయి. ఏప్రిల్, మే నెలల్లో సోనామసూరి రూ. 3,200 నుంచి రూ. 3,500 వరకూ పలికింది. ప్రస్తుతం ఏకంగా క్వింటా రూ. 5800 నుంచి రూ. 6000 వరకూ చేరింది. బియ్యం తూకాలు, జీఎస్టీ, లగేజీ అని అదనంగా బస్తాకు రూ. 100 వరకూ వ్యాపారులు తీసుకుంటున్నారు. ప్రధానంగా గత ఏడాది తుపాన్లు, ప్రకృతి ప్రభావం కారణంగా వరి పంట దిగుబడి బాగా తగ్గింది. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.